ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పంతం నెగ్గించుకుబోతున్న ప‌తంజ‌లి సంస్థ‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 09, 2018, 11:04 AM

ప్రభుత్వ పనితీరులో అవకతవకలపై, నల్లధనంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, తరచూ తన వాణిని వినిపించే బాబా రాందేవ్‌, ప్రభుత్వాల నుండి తనకు కావాల్సిన రాయితీలు సంపాదించుకోవాలంటే ద్వంద్వ ప్రమాణాలు పాటించడంలో ఏ మాత్రం వెనుకాడడం లేదు. గ్రేటర్‌ నొయిడాలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వే పొడవునా గల 455 ఎకరాల భూమిని ఫుడ్‌ పార్క్‌ ఏర్పాటు పేరుతో దక్కించుకోవడమే ఇందుకు స్పష్టమైన ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అఖిలేష్‌ యాదవ్‌ ప్రభుత్వ హయాంలో యాదవ్‌ సంబంధాలను ఉపయోగించుకుని తన పతంజలి గ్రూపునకు ప్రత్యేక రాయితీలతో కూడిన షరతులపై ఆ స్థలాన్ని కేటాయించుకోగలిగారు. ఇప్పుడు మరిన్ని రాయితీలు, హక్కుల కోసం బీ.జేపీ ప్రభుత్వంపై ప‌రోక్షంగా ఒత్తిడి తీసుకువ‌స్తున్నారు. దేశవ్యాప్తంగా ఎవరైనా మెగా ఫుడ్‌ పార్క్‌ ఏర్పాటు చేస్తే వారికి కేంద్రం ఇచ్చే రు.150కోట్ల సబ్సిడీపై ఇప్పుడు రాందేవ్‌ కన్ను పడింది. అఖిలేష్‌ యాదవ్‌ ప్రభుత్వ హయాంలో పొందిన దానికన్నా ఎక్కువగా ప్రత్యేక రాయితీలు, ప్రయోజనాలను కోరుతూ రాందేవ్‌ ప్రత్యేక షరతులను కూడా విధిస్తున్నారు. 


ప‌తంజ‌లి ఒక్క‌సారిగా ప్రాజెక్టును యూపీ ఆవ‌ల‌కు త‌ర‌లిస్తామ‌ని బెదిరిస్తుండ‌టంతో ఆయ‌న అడిగింద‌ల్లా చేసేందుకు ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం కూడా తల వూపేందుకు రంగం సిద్దమైంది. పతంజలి విధించిన షరతులకు తలొగ్గకపోతే రాష్ట్రం వెలుపలకు ఫుడ్‌ పార్క్‌ను తరలిస్తామని పతంజలి సిఇఓ ఆచార్య బాలకృష్ణ చేసిన బెదిరింపు ఒక్కటే ఈ పరిస్థితికి కారణం కాదు, బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా నుండి వచ్చిన ఆదేశాలు కూడా ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం అంగీకరించడానికి మరో కారణం. ఇటీవలే అమిత్‌ షాను బాబా రాందేవ్‌ కలిసి మాట్లాడారు. అయితే ఇక్కడ ఒక విషయం యూపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఆశ్చర్యకరంగా వుంది. 455 ఎకరాలు ఏకమొత్తంగా కేటాయించడానికి అది కూడా దేశ రాజధాని సరిహద్దుల్లో ఇవ్వడానికి ఏ రాష్ట్రం సిద్ధంగా వుంటుంది? కానీ యూపీ ప్రభుత్వం సిద్ధమైంది. 


ఈ దిశ‌లో సంబంధిత అధికారుల‌ను ప‌తంజ‌లి యాజ‌మాన్యంతో మాట్లాడాల్సిందిగా పుర‌మాయించారు. ప్ర‌భుత్వం రాయితీల గురించి మాట్లాడుతుంద‌ని యోగి ఆదిత్యా నాథ్ చెప్పారు. తాము ప‌తంజ‌లిని రాష్ట్రం నుంచి త‌ర‌లిపోకుండా చూస్తామ‌ని యూపీ మౌలిక‌, పారిశ్రామిక అభివృద్ది మంత్రి స‌తీస్ మిశ్రా చెప్పారు. యూపీ సీఎం హామీ ఇచ్చిన త‌ర్వాత రాష్ట్రం నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోవాలా వ‌ద్దా అనే దాని గురించి పున‌రాలోచిస్తున్నామ‌ని ప‌తంజలి వ‌ర్గాలు వెల్ల‌డించాయి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com