అమరావతి: ఓడీఎఫ్ ప్లస్లో కూడా మన రాష్ట్రమే ముందంజలో ఉండాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నీరు-ప్రగతి, వ్యవసాయంపై అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో చంద్రబాబు మాట్లాడుతూ కర్నూలు, కడపలో ఉపాధి కూలీల సంఖ్య మరింత పెరగాలన్నారు. ఈ ఏడాది రూ.10వేల కోట్ల నరేగా నిధుల లక్ష్యం చేరాలన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 5,82,014 ఇళ్లు పూర్తి చేశామని, ఏప్రిల్ నెలలో గతేడాదికన్నా రెట్టింపు ఇళ్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణం మరింత వేగవంతం కావాలన్నారు. 19 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు. వేసవిలో వడగాల్పులు పెరిగే అవకాశం ఉందన్నారు. చెరువులు, కాల్వలు, జలాశయాల్లో నీటినిల్వలు పెంచాలన్నారు. పచ్చదనం, తుంపర సేద్యం ద్వారా ఉష్ణోగ్రతల్లో తగ్గుదల ఏర్పడుతుందన్నారు. ప్రకాశం జిల్లాలో ఇంజక్షన్ వెల్స్తో సత్ఫలితాలు సాధిస్తున్నామని అన్నారు. 525 గ్రామాల్లో ఇంజక్షన్ వెల్స్ భారీగా పెట్టాలన్నారు. బావుల రీఛార్జింగ్పై అందరూ దృష్టి పెట్టాలన్నారు. వరదనీరు ఇంజక్షన్ వెల్స్కు, పంటకుంటలకు చేరేలా చూడాలని, పంటకుంటల తవ్వకం వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.