ఎన్నో ఏళ్ల నుంచి బీజేపీకి నమ్మినబంటుగా ఉన్న కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా ఆ పార్టీని వీడారు. కొన్ని నెలలుగా బీజేపీపై ఆయన తీవ్ర అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ తీసుకుంటున్న, తీసుకున్న నిర్ణయాలను ఆయన బహిరంగంగా విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శనివారం ఆయన బీజేపీని వీడుతున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని అన్నారు. బిహార్ రాజధాని పట్నాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన నిర్ణయాన్ని వెల్లడించారు. ‘‘బీజేపీతో అన్ని బంధాలను తెగదెంపులు చేసుకుంటున్నా. ఈ రోజు (శనివారం) నుంచి అన్ని రకాల పార్టీ రాజకీయాల నుంచి ‘సన్యాసం’ తీసుకుంటున్నా’’ అని ఆయన ప్రకటించారు. ఎన్డీయే హయాంలో ప్రజాస్వామ్యం ఉనికి ప్రమాదంలో పడిందని, ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు బీజేపీ నుంచి బయటకు వస్తున్నానని అన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగకపోవడానికి ఎన్డీయే ప్రభుత్వ విధానాలే కారణమన్నారు. కాగా, జనవరి 20న ‘రాష్ట్ర మంచ్’ను ఆయన ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అది రాజకీయ పార్టీ కాదని, ప్రజా వ్యతిరేక విధానాలను ఎత్తి చూపే ఓ సంస్థ మాత్రమేనని ఆయన ఆనాడు స్పష్టం చేశారు.