న్యూఢిల్లి : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ టిడిపి ఎంపిలు పార్లమెంటు ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. పార్లమెంటు రెండవ విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనప్పటినుంచి ఎపికి ప్రత్యేక హోదా కోసం టిడిపి ఎంపిలు ధర్నా చేస్తున్నారు. తెలుగుదేశం ఎంపీ మాగుంట బాబు కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీల అమలులో అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా సైకిల్ పై పార్లమెంటుకు వచ్చారు. కేంద్రం అవిశ్వాస తీర్మానంపై సభలో చర్చకు భయపడుతోందని విమర్శించారు. విలేకరులతో మాట్లాడిన ఆయన విభజన చట్టం హామీల అమలు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే వరకూ తమ ఆందోళన కొనసాగుతుందని మాగుంట స్పష్టం చేశారు.