అమరావతి : కేంద్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీని ఇబ్బందుల పాలు చేయడానికి జగన్, పవన్ లతో డ్రామాలు ఆడుతోందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రం వైఖరిపై ప్రజలలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఎన్డీయేకు గుడ్ బై చెబుతున్నట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ఆయన లేఖ రాశారు. అనంతరం తెలుగుదేశం ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడారు. వైకాపా అవిశ్వాసానికి మద్దతు ఇవ్వడం కాకుండా సొంతంగా తెలుగుదేశమే లోక్ సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతుందని ఆయన చెప్పారు. ఆయన ఆదేశం మేరకు తెలుగుదేశం ఎంపీ తోట నరసింహం లోక్ సభ సెక్రటరీ జనరల్ కు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. ప్రత్యేక హోదా మీ ద్వారానే వచ్చేలా చూస్తాం…అవిశ్వాసం పెట్టు, ఎంపీలతో రాజీనామాలు చేయించు అని జగన్, ఆమరణ దీక్ష చేయి…నీ ద్వారా ప్రత్యేక హోదా ఇస్తామని పవన్ కల్యాణ్తో కేంద్రం డ్రామాలు ఆడుతోందని చంద్రబాబు విమర్శించారు. నాడు తెలుగుదేశాన్ని అంతం చేయడానికే రాష్ట్ర విభజన చేశారనీ, ఈ రోజు తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడానికి కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం మహా కుట్ర చేస్తోందని చంద్రబాబు ఆరోపించారు.