ఢిల్లీ : దేశ సమగ్రాభివృద్ధికోసం అందరూ కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. పార్లమెంటు సెంట్రల్ హాలులో జరుగుతున్న జాతీయ ప్రజాప్రతినిధుల సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. సామాజిక న్యాయం, ప్రజాప్రతినిధుల బాధ్యతలపై ప్రసంగించారు. రాష్ట్రాల మాదిరిగానే దేశాల మధ్య కూడా పోటీ ఉంటుందని.. ఆ పోటీతత్వం వల్లే రాష్ట్రాలు, దేశాలు అభివృద్ధి సాధిస్తాయన్నారు. 'సాధారణంగా ఒక విద్యార్థి ఒక విషయంలో బాగా రాణించినా మరో విషయంలో వెనుకబడిపోవచ్చు. అలాగే రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలు కూడా ఒకేలా ఉండవు. కొన్ని అభివృద్ధి చెంది ఉంటాయి. మరికొన్ని వెనుకబడిపోయి ఉంటాయి. వెనుకబడిన జిల్లాలు తమ లోపాలను సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. దేశంలో అభివృద్ధి చెందిన జిల్లాతో పోలిస్తే మనం ఎక్కడున్నామో గమనించాలి. తదనుగుణంగా ప్రణాళిక రచించుకోవాలి. ఇందులో జిల్లా కలెక్టర్ల పాత్ర కీలకం. కలెక్టర్లు ఉత్తమ పనితీరు కనబరిచిన జిల్లాలతో పోల్చుకోవాలి. అక్కడ అనుసరిస్తున్న విధానాలను పరిశీలించాలి. ఇందుకు కలెక్టర్లకు నాయకులు, ప్రజల భాగస్వామ్యం అవసరం. పనితీరు ఆధారంగానే కలెక్టర్ల బదిలీలు ఉంటాయి' అని మోడీ అన్నారు.