ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ ఏడాది ఆర్‌బీఐ వడ్డీరేట్లను పెంచొచ్చు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 10, 2018, 12:49 PM

ముంబయి: కీలక వడ్డీరేట్లపై గతకొంత కాలంగా రిజర్వ్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) తటస్థ వైఖరిని కొనసాగిస్తూ వస్తోంది. ఇటీవల ఫిబ్రవరిలో జరిగిన 2017-18 ఆర్థిక సంవత్సరం చివరి ద్వైమాసిక పరపతి విధాన సమీక్షలోనూ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. అయితే 2018-19 ఆర్థిక సంవత్సరంలో జరగబోయే సమీక్షల్లో వడ్డీ రేటును 0.25శాతం పెంచే అవకాశముందట. ద్రవ్యోల్బణ భయాలు, ద్రవ్యలోటు పెరగడం వల్లే వడ్డీ రేట్లు పెరిగే అవకాశాలున్నాయని కేర్‌ రేటింగ్స్‌ అనే సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.


చమురు ధరలు, ఇంటి అద్దెలు పెరగడం తదితర కారణాల వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుందని ఆర్‌బీఐ అంచనా వేస్తోంది. 2018-19 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో ద్రవ్యోల్బణం 5.1శాతం నుంచి 5.6శాతం వరకు పెరిగే అవకాశముందని భావిస్తోంది. ఆ తర్వాత తగ్గే సూచనలు కన్పిస్తున్నాయని ఇటీవల జరిగిన సమీక్షలో పేర్కొంది. ఇదే సమయంలో ద్రవ్యలోటు కూడా పెరగడంతో వడ్డీ రేట్లను పెంచక తప్పదని నివేదిక చెబుతోంది. ‘2018లో రెపో రేటును 0.25శాతం పెంచే అవకాశముంది. ప్రస్తుతం ఇది 6శాతంగా ఉంది’ అని నివేదిక వెల్లడించింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గానూ ఆర్‌బీఐ తొలి ద్వైమాసిక పరపతి విధాన కమిటీ సమావేశాలు ఏప్రిల్‌ 4-5న జరగనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com