తిరుమల: తిరుమలలో రథసప్తమి వేడుకలు బ్రహ్మోత్సవాన్ని తలపించేలా ఇవాళ ఘనంగా ప్రారంభమయ్యాయి. నేడు ఉదయం 5 గంటలకు సూర్యప్రభవాహనం కన్నులపండువగా ప్రారంభమైంది. శ్రీ వెంకటేశ్వరస్వామి శ్రీమలయప్ప స్వామి అవతారంలో నాలుగుమాడా వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇస్తున్నారు.ఆది దేవుడు శ్రీనివాసుడు కాబట్టి ఆ సూర్యున్నే వాహనంగా చేసుకుని తిరుమల వీధుల్లో తిరుమల శ్రీవారు ఊరేగుతారు. ఈ రధసప్తమీ రోజు ఉదయం జరిగే మొదటి వాహనం సూర్యప్రభ వాహనం. వాహనం ప్రారంభమైన సమయంలో తిరుమలేశుడు ఆలయం నుండి బయలు దేరి తిరువీదుల్లో ఊరేగుతూ తూర్పు మాడవీధుల నుండి ఉత్తరం మాడవీధుల గుండా పడమర మాడవీధులకు చేరుతారు. ఆ తరువాత దక్షిణ మాడవీధుల వద్దకు రాగానే సూర్య భగవానుడు నేరుగా తన ఉషోదయ కిరణాలతో స్వామి వారి పాదాలపై పడి ఆంజలి గటించి, ఆశీర్వచనం తీసుకుంటారు. తాను ఈ భూలోకానికి వెలుగును నింపే దేవుడే అయినప్పటికీ... ఈ జగత్ అంటే ఈ భూ మండలాన్ని పరిపాలించేది మాత్రం తిరుమలేశుడే కనుక. ముందుగా స్వామి వారికి ఆంజలి గటించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తీసుకుంటాడు సూర్య బగవానుడు. తిరుమలలో జరిగే ఈ సన్నివేశం కళ్లారా చూడ్డానికి ఆ సమయంలో భక్తులు తిరువీధుల్లో పెద్దెత్తున చేరుకుంటారు. కర్పూర హారతులతో స్వామివారికి నీరాజనాలు పలుకుతారు.