ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు ఆత్మకూరు ఉప ఎన్నిక...ఎన్నికలకు సర్వంసిద్దం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 22, 2022, 04:59 PM

రేపు నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్నది. దీంతో ఉప ఎన్నికకు అధికార్లు సర్వంసిద్దంచేశారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణంలో ఆత్మకూరు ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. వైసీపీ తరఫున గౌతమ్ రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి బరిలో దిగగా.. ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ పోటీకి దూరంగా ఉంది. అయితే బీజేపీ తరఫున భరత్ కుమార్ పోటీలో ఉన్నారు.


ఈ నెల 23న జరగనున్న ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు రిటర్నింగ్‌ అధికారి, జేసీ ఎంఎన్‌ హరేందిర ప్రసాద్‌ వెల్లడించారు. ఈ మేరకు ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నట్లు హరేందిర ప్రసాద్‌ తెలిపారు. ఇందుకు సంబంధించి పోలింగ్‌ సిబ్బందికి పూర్తిస్థాయి సామగ్రిని అందించామన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో 279 పోలింగ్‌ కేంద్రాల్లో ఏపీఎస్‌పీ కేంద్ర బలగాలతో పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


నియోజకవర్గంలో 123 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి అక్కడ ప్రత్యేక బందోబస్తును నియమించామని హరేందిర ప్రసాద్‌ పేర్కొన్నారు. మొత్తం జనరల్‌ స్టాఫ్‌ 1,339 మంది, పోలీసులు 1,032 మంది, మైక్రో అబ్జర్వర్లు 142 మంది, సెక్టార్‌ అధికారులు 38 మంది మాస్టర్‌ ట్రైనీలు 10 మంది, వీడియో గ్రాఫర్లు 78 మంది పోలింగ్‌ జరిగేంత వరకు విధుల్లో ఉంటారన్నారు. పోలింగ్‌కు ఒక రోజు ముందు ప్రచారం నిలిపివేయాలనే ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగిసిందన్నారు.


ఇప్పటికే ఓటర్లకు, పంచాయతీ కార్యదర్శులు, బీఎల్‌ఓలు, వలంటీర్ల సహకారంతో ఓటర్లందరికీ స్లిప్‌లు పంపిణీ చేశామని హరేందిర ప్రసాద్‌ చెప్పారు. ఓటర్లు తప్పనిసరిగా స్లిప్‌లతో పాటు గుర్తింపు కార్డు, ఓటరు ఐడీ లేదా ఆధార్‌ బ్యాంకు పాస్ పుస్తకం, పాస్‌పోర్ట్‌ తదితర వాటిలో ఏదో ఒక గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకొచ్చి చూపాలన్నారు. ఓటర్లు నిర్భయంగా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే, సజావుగా పోలింగ్‌ జరిగేందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com