ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్వర్ణరథంపై మెరిసిన శ్రీ పద్మావతి అమ్మవారు

Bhakthi |  Suryaa Desk  | Published : Mon, May 16, 2022, 01:58 PM

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా రెండో రోజైన సోమ‌వారం స్వర్ణరథంపై అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. స్వర్ణరథంపై అమ్మవారిని దర్శిస్తే తలచిన పనులు నెరవేరడంతో పాటు, మరో జన్మ ఉండదని అర్చ‌కులు తెలిపారు.


ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉత్సవర్లను ఊరేగింపుగా స్వర్ణరథం మంటపానికి తీసుకొచ్చారు. ఉదయం 7 నుండి 8. 30 గంటల వ‌ర‌కు స్వర్ణరథోత్సవం వేడుకగా జరిగింది. బంగారు రథాన్ని అధిరోహించిన అమ్మవారు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.


మధ్యాహ్నం 2. 30 నుండి 4. 30 గంటల వ‌ర‌కు అమ్మవారి ఉత్సవర్లకు శుక్రవారపు తోటలో స్నపనతిరుమంజనం నిర్వహించ‌నున్నారు. ఇందులో భాగంగా పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్ళతో అభిషేకం చేస్తారు. రాత్రి 7. 30 నుండి 8. 30గంటల వరకు అమ్మ‌వారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భ‌క్తుల‌ను క‌టాక్షించ‌నున్నారు.


ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవోలోకనాధం, ఏఈవో ప్రభాకర్ రెడ్డి, అర్చకులు బాబుస్వామి, సూప‌రింటెండెంట్ శేష‌గిరి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ దామోదరం పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com