వైసీపీ అరాచక శక్తులు మాజీ జడ్పీటీసీ ఇంటిపై దాడి చేశాయని.. ఇందులో పోలీసుల వైఫల్యం అడుగడుగునా కనిపిస్తోందని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. బహిరంగ ప్రదేశాల్లో వినాయక విగ్రహాలు వద్దని కోర్టు చెప్పినా పట్టించుకోలేదన్నారు. అర్థరాత్రి వరకూ ఊరేగింపు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రతి ఏటా నిమజ్జనం నాడు వైసీపీ గొడవలు చేస్తోందని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ధూళిపాళ్ల వాపోయారు. పోలీసులను అడ్డుపెట్టుకుని వైసీపీ దాడులు చేస్తోందన్నారు.
శారద, వేణు దంపతులకు టీడీపీ అండగా ఉంటుందన్నారు. దాడి జరిగిన తర్వాత కేసు పేరుతో పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారని ధూళిపాళ్ల పేర్కొన్నారు. తగలబెట్టిన ద్విచక్ర వాహనాలను పోలీసులు ఎక్కడకు తీసుకెళ్లారని ప్రశ్నించారు. బాధితులను స్టేషన్కు రమ్మని పోలీసులు బెదిరిస్తున్నారన్నారు. రెండు గంటల పాటు అల్లరి మూకలు అరాచకం చేశాయన్నారు. వీడియోల్లో వైసీపీ దాడులు స్పష్టంగా కనిపిస్తున్నాయని.. బాధితులపైనే కేసులు పెట్టేందుకు అధికార పార్టీ నేతలు యత్నిస్తున్నారని ధూళిపాళ్ల పేర్కొన్నారు.