ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిద్ధాసనంలో కూర్చొని ఉన్న శివుడు కొలువై ఉన్న క్షేత్రం!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 06, 2020, 05:22 PM

పరమ శివుడు సాధారణంగా లింగరూపంలో మనకు దర్శనమిస్తాడు. అయితే అతి అరుదుగా మాత్రమే విగ్రహ రూపంలో కనిపిస్తాడు. అందులోనూ సిద్ధాసనంలో కూర్చొని ఉన్న శివుడు కొలువై ఉన్న క్షేత్రం అనంతపురం జిల్లాలో అమరాపురం మండలం హేమావతిలోని సిద్ధేశ్వరాలయం.కుడిచేతిలో బ్రహ్మకపాలాన్ని, మెడలో కపాలాలను కూడా స్వామివారు ధరించి సగం మూసిన కనులతో కనిపిస్తారు. ఇటువంటి రూపం భారత దేశంలో ఇదొక్కటే అని స్థానికులు చెబుతున్నారు. ఇదే ఆలయంలో పంచ లింగాలు కూడా మనం దర్శించవచ్చు. ప్రతి శివరాత్రికి సూర్యాస్తమయం సమయంలో సూర్యకిరణాలు ఈ దేవాలయంలోని మూల విగ్రహం నుదిటిమీద ఖచ్చితంగా పడతాయి.సృష్టి స్థితి లయకారుడైన శివుడి తలమీద చంద్రుడితో పాటు సూర్యుడు ఉండటం వలనే ఈ అద్భుతం జరుగుతుందని భక్తులు నమ్ముతారు. ఇక ఆలయంలో శివుడికి ఎదురుగా ఉన్న నంది స్వామివారిని చూస్తున్నట్టుగా కాక కొంత పక్కకు తిరిగి ఉంటుంది. అన్ని ఆలయాల్లా కాకుండా పడమర ముఖంగా ప్రవేశ ద్వారం ఉన్న దేవాలయాల్లో హేమావతి సిద్దేశ్వరస్వామి దేవాలయం కూడా ఒకటి. హేమావతిని పూర్వ కాలంలో హెంజేరుగా పిలిచేవారు. కాలక్రమంలో అది హేమావతిగా మారింది. పూర్వం ఈ ప్రాంతాన్ని నోలంబరాజులు పరిపాలించేవారు. అందువల్ల హేమావతిలోని సిద్దేశ్వరుడిని నోలంబేశ్వరుడు, ఎంజేరప్ప అని కూడా అంటారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com