ఒక వైపు పాకిస్తాన్ ఉగ్రవాదం ఎగుమతులు, మరోవైపు చైనా సరిహద్దు వద్ద కయ్యానికి దిగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మన దేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కేంద్రం వ్యూహాలు రచిస్తోంది. రక్షణ శాఖ అమ్ముల పొదిలోకి మరిన్ని సరికొత్త అస్త్రాలను చేర్చేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. ఇప్పటికే జూలై నెలాఖరుకు తొలి విడతగా 6 రఫేల్ యుద్ధ విమానాలు చేరుకోనుండగా.. తాజాగా మరో కీలక ఒప్పందం చేసుకుంది. రష్యా నుంచి 33 కొత్త యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనలకు రక్షణశాఖ ఆమోద ముద్రవేసింది. రూ. 18,148 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టున్నారు. రష్యా నుంచి 12 Su-30MKI (సుఖోయ్) యుద్ధ విమానాలతో పాటు మరో 21 MiG-29 (మిగ్) యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు ప్రస్తుతం మన వద్ద ఉన్న 59 మిగ్-29 విమానాలను ఆధునీకరించనుంది. అంతేకాకుండా భారత వాయుసేన, నౌకాదళానికి అదనంగా 248 అస్త్ర ఎయిర్ టూ ఎయిర్ మిసైల్స్ను సమకూర్చనుంది. వీటితో పాటు వేయి కి.మీ. దూరంలోని లక్ష్యాలను సైతం ఛేదించగల లాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్స్ తయారీకి రక్షణశాఖ ఓకే చెప్పింది. ఈ క్షిపణులను డీఆర్డీవో తయారుచేయనుంది. ఇవి త్రివిద దళాలకు చేరితే భారత రక్షణ వ్యవస్థ మరింత పటిష్టం కానుంది.