కనీస మానవత్వం లేకుండా కరోనా రోగుల మృతదేహాలను గుంతలోకి విసిరేస్తున్న దారుణ దృశ్యాలు కర్ణాటకలోని బళ్లారిలో వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ఈ వీడియో దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. కరోనా వైరస్తో మరణించిన రోగుల మృతదేహాలను మూట కట్టి ఒక దాని మీద మరొకటి వేసి అత్యంత దారుణంగా ఒకే గోతిలో (గుంత)లోకి విసిరేసి అంత్యక్రియలు పూర్తి చేశారు. గోతిలోకి మృతదేహాలను విసిరివేస్తున్న సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో చిత్రీకరించాడు. అది కాస్త సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్గా మారింది. ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక సరిహద్దులో మైనింగ్ హబ్గా పేరు పొందిన బళ్లారి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.బళ్లారి జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. సోమవారం (జూన్ 29) కరోనా కారణంగా ఈ జిల్లాలో 8 మంది మృతి చెందారు. ఈ రోగులకు సంబంధించిన మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించకుండా వైద్య సిబ్బంది సమూహికంగా ఖననం చేశారు. పెద్ద గుంతలు తీసి ఒకేచోట పూడ్చి పెట్టారు. ఒక్కో గుంతలో ఇద్దరేసి రోగుల మృతదేహాలను వేసి పూడ్చిపెట్టినట్లు తెలుస్తోంది. మృతదేహాలను అమానవీయంగా గుంతలోకి విసిరేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.