ఏపీలో మంత్రులు మోపిదేవి వెంకటరమణ,పిల్లి సుభాష్ చంద్రబోస్ లు తమ ఎమ్మెల్సీ పదవులతో పాటు మంత్రి పదవులకు రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో వారు ఎన్నిక కావడంతో తమ పదవులకు రాజీనామా చేశారు. అయితే ఇప్పుడు అంతటా ఒకటే చర్చ జరుగుతుంది. ఈ రెండు మంత్రి పదవులు ఎవరికి దక్కనున్నాయన్న చర్చ వైసీపీ వర్గాల్లో జోరుగా సాగుతుంది.
గుంటూరు జిల్లాకు చెందిన మోపిదేవి స్థానంలో అదే వర్గానికి చెందిన సీనియర్ నేత,ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. గతంలో కూడా ఈ మంత్రి పదవికి సంబంధించి విడదల రజని పేరు వినిపించింది. ఇద్దరు కూడా ఒకే జిల్లాకు చెందిన వారు కావడంతో వీరిలో ఒక్కరికే పదవి దక్కే అవకాశం ఉందని సమాచారం. మరి కొంత మంది నేతల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. మరో వైపు మంత్రి పదవులకు సంబంధించి ఇప్పటికే ఎవరికి వారు లాబీయింగ్ ప్రారంభించారని తెలుస్తోంది. మరి సీఎం జగన్ ఎవరికి అవకాశం ఇస్తారో చూడాలి.