ఏపీలో ఇప్పటికే అనేక పథకాలు, కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న సీఎం జగన్.. ప్రభుత్వం తాజాగా మరో సువర్ణాధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు నానాటికీ తీసికట్టుగా ఉన్న ఆరోగ్య శ్రీ సేవలను మరింత పుంజుకునేలా చేసిన జగన్ సర్కారు చేసింది. గతంలో చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన బాకీలను తీర్చడంతో పాటు.. ఆరోగ్య శ్రీ ఆసుపత్రులను, ఈ పథకం కింద ఇచ్చే సేవలను కూడా రెట్టింపు చేశారు.ఇక, ఈ పథకం పరిధిలోకి వచ్చే.. అంబులెన్సులను కూడా అధునాతనంగా చేశారు. ఒకేసారి ఏకంగా 1,088 వాహనాలను (108-104 కలిపి) బుధవారం ఉదయం 9.30 గంటలకు విజయవాడ నడిబొడ్డున బెంజ్ సర్కిల్లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖామంత్రి ఆళ్ల నాని, పంచాయతీరాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. అత్యున్నత ప్రమాణాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, వసతులతో 108, 104 సర్వీసుల్లో సమూలు మార్పులు చేసి వాటిని తీర్చిదిద్దారు. సీఎం వైఎస్ జగన్ విజయవాడ బెంజి సర్కిల్ దగ్గర అత్యాధునిక అంబులెన్స్ సర్వీసులను ప్రారంభించారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగిని ఆస్పత్రికి తరలించే సమయంలో కూడా చికిత్స అందించేలా వాటిలో మార్పులు చేశారు. చిన్నారుల కోసం కూడా ప్రత్యేకంగా నియో నేటల్ అంబులెన్సులు స్టార్ట్ చేశారు.
ఇక, 108 సర్వీసులో సమూల మార్పులు చేశారు. వాటిలో అత్యాధునిక వైద్య సేవలందించే పరికరాలను ఏర్పాట్లు చేశారు. కొత్తగా 412 అంబులెన్సు లను కొనుగోలు చేసి, ఈ సర్వీసు కోసం నడపనున్నారు. ఇప్పటికే ఉన్న వాటిలో 336 అంబులెన్సులను కూడా వినియోగించనున్నారు.
కొత్తగా సిద్ధం చేసిన 412 అంబులెన్సులలో 282 బేసిక్ లైఫ్ సపోర్టు (బీఎల్ఎస్)కు సంబంధించినవి కాగా, 104 అడ్వాన్స్ లైఫ్ సపో ర్టు(ఏఎల్ఎస్)తో తీర్చి దిద్దారు. మరో 26 అంబులెన్సులను చిన్నారులకు (నియో నేటల్) వైద్య సేవలందించేలా తయారు చేశారు. బీఎల్ఎస్ అంబులెన్సులలో స్పైన్ బోర్డు, స్కూప్ స్ట్రెచర్, వీల్ ఛైర్, బ్యాగ్ మస్క్, మల్టీ పారా మానిటర్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేయగా, ఏఎల్ఎస్ అంబులెన్సులలో అత్యవసర పరిస్థితిలో ఉన్న రోగిని ఆస్పత్రికి తరలించే సమయంలో కూడా వైద్య సేవలందించేలా అత్యాధునిక వెంటిలేటర్లు ఏర్పాటు చేశారు. ఇక నియోనేటల్ అంబులెన్సులలో ఇన్క్యుబేటర్లతో పాటు, వెంటిలేటర్లను కూడా అమర్చారు.
మొత్తంగా చూస్తే.. మరో సువర్ణాధ్యాయానికి జగన్ సర్కారు శ్రీకారం చుట్టింది.సగటున ప్రతి 1,19,545 మందికి ఒక అంబులెన్స్ ఉండేది. ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు మిన్నగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు దగ్గరగా ప్రతి 74,609 మందికి ఒక అంబులెన్స్ అందుబాటులో ఉంటుంది. గతంలో ఏడాదికి 6,33,600 కేసుల్లో సేవలందించగా ఇప్పుడు రెట్టింపు సంఖ్యలో ఏడాదికి 12 లక్షల మందికి సేవలందించేలా తీర్చిదిద్దారు.