ప్రతిపక్ష టీఆర్ఎస్ ను దెబ్బకొట్టేందుకు అధికార వైసీపీ వ్యూహాలకు పదును పెడుతోంది. చంద్రబాబును సొంత జిల్లా చిత్తూరులో దెబ్బకొట్టాలని ఆ పార్టీ నేతలు పథకాలు రచిస్తున్నారు. పోయిన ఎన్నికల్లో చిత్తూరు జిల్లా నుంచి ఒక్క చంద్రబాబు తప్ప.. టీడీపీ నుంచి ఎవరూ గెలవలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటి పార్టీకి పూర్వ వైభవం తేవాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. కానీ జిల్లాలో టీడీపీని కోలుకోకుండా చేయాలని భావిస్తున్న వైసీపీ... ఆ పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నేతలను సైతం తమ పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి, మరో మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్ టీడీపీకి రాజీనామా చేశారు. వారిద్దరూ స్థానిక సంస్థల ఎన్నికల నాటికి వైసీపీలో చేరడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. మరో మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ సైతం పార్టీకి దూరంగా ఉంటున్నారని టాక్. ఆయన సైతం అధికార పార్టీలో చేరే అవకాశం లేకపోలేదనే చర్చ జరుగుతోంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల నాటికి చిత్తూరు జిల్లాలో మరింత మంది ద్వితీయ శ్రేణి నేతలు టీడీపీకి హ్యాండ్ ఇచ్చి అధికార పార్టీలో చేరే అవకాశం ఉందన్న ఊహాగానాలు జిల్లాలో సాగుతున్నాయి. రాష్ట్రంలో టీడీపీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలన్న చంద్రబాబుకు సొంత జిల్లాలోనే కోలుకోలేని దెబ్బకొట్టాలని వైసీపీ వ్యూహాలు రచిస్తోంది.