కరోనా కారణంగా ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ కుదేలవుతోంది. చాలాదేశాల్లో లాక్ డౌన్ కొనసాగుతోంది. ముఖ్యంగా, కరోనా వల్ల అమెరికా, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాలు అతలాకుతలమయ్యాయి. ఆ దేశాల్లో ఆర్ధిక వ్యవస్థ మునుపెన్నడూ లేనంతగా పతనమైంది. దీంతో జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ కోవిడ్- 19 వల్ల తమకు 130 బిలియన్ పౌండ్ల నష్టం జరిగిందని, ఆ బిల్లును చైనాకు పంపి చెల్లించాలని డిమాండ్ చేసినట్లు నెట్టింట ఒక వార్త హల్చల్ చేస్తోంది. దీనిపై స్పందించిన జర్మన్లు చైనాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే తమ నష్టాన్ని భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆ న్యూస్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. భారత్ కూడా చైనాకు ఈ విధమైన ఇన్ వాయిస్ బిల్ పంపాలని భారతీయులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై ఇండియా టుడే ఆరాతీయగా ఇది ఫేక్ న్యూస్ అని తేలింది. జర్మనీలోని బిల్డ్ అనే టాబ్లాయిడ్ న్యూస్ పేపర్ ఈ డిమాండ్ చేసిందని వెల్లడించింది.