అసిడిటీ, గ్యాస్, జీర్ణ సమస్యలు ఇలా అనేక సమస్యలతో చాలా మంది బాధపడుతుంటారు. ఈ సమస్యల్లో ఏదో ఒకటి వచ్చిదంటే చాలు వాటికి తోడు అనేక సమస్యలన్నీ మనల్ని చుట్టుముడతాయి. అందుకే కొన్ని చిట్కాలను పాటించడం వల్ల ఈ సమస్యని త్వరగా తగ్గించుకోవచ్చు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అసిడిటీగా అనిపించినప్పుడు నీటిని బాగా తాగాలి. ముఖ్యంగా గోరువెచ్చని నీరు తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అదే విధంగా పుదీనా కూడా ఈ సమస్యలని దరి చేరనివ్వకుండా ఉంచుతుంది. ఇందుకోసం ఏం చేయాలంటే నీటిలో కొద్దిగా పుదీనా ఆకులు వేసి బాగా మరిగించాలి. ఇది బాగా మరిగిన తర్వాత గోరువెచ్చగా అయ్యే వరకూ ఉంచాలి. ఆ తర్వాత అందులో తేనె కలపాలి. ఇలా రెగ్యులర్గా తాగుతుంటే త్వరగానే సమస్య తగ్గిపోతుంది. అవసరం అనుకుంటే ఇందులో కొద్దిగా అల్లం రసం కూడా కలపొచ్చు. జీలకర్ర కూడా అసిడిటీ సమస్యని పరిష్కరిస్తుంది. నీటిలో జీలకర్ర వేసి బాగా మరిగించాలి. ఈ నీటిని అలా అయినా తాగొచ్చు. అలా తాగలేని వారు నీటిని వడకట్టి తాగేయొచ్చు. ఇలా చేయడం వల్ల చాలా వరకూ సమస్య తగ్గుతుంది. అదే విధంగా తిన్న వెంటనే అల్లం ముక్కని నోట్లో వేసుకుని వచ్చే రసంని మింగుతూ ఉంటే సమస్య చాలా వరకూ తగ్గిపోతుంది. ఇక అసిడిటీ సమస్యకి లవంగాలు కూడా మంచి పరిష్కారాన్ని చూపుతాయి. లవంగాలను నోట్లో వేసుకుని ఆ రసాన్ని మింగుతుంటే త్వరగా సమస్య తగ్గుతుంది. ఫైబర్ ఎక్కువగా తీసుకోవాలి. తాజా కూరగాయలు, తాజా పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. వీటిని పాటించడం వల్ల సమస్య చాలా త్వరగా తగ్గుతుంది.