తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు యువత అధ్యక్ష పదవికి దేవినేని అవినాష్ రాజీనామా చేసారు. తన రాజీనామా లేఖను పార్టీ కార్యాలయానికి పంపించారు. ఈ లేఖలో తాను పార్టీకి ఎందుకు రాజీనామా చెయ్యాల్సి వచ్చిందనే విషయాన్నీ వివరంగా రాసారు. "గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి గత రెండు నెలలుగా మీడియాలో తాను పార్టీ మారుతున్నాడన్న వార్తలు వచ్చాయి. నిజానికి ఆ వార్తలు సృష్టించబడ్డాయి. ఆ పని ఎవరు చేసారో కూడా మీకు చాలా సార్లు విన్నవించాను. ఈ రోజువరకు నా సొంత ప్రయోజనాలకోసం ఎప్పుడు ఆలోచించకుండా అధిష్టానం ఎక్కడ పోటీ చెయ్యమంటే అక్కడ పోటీ చేశాను. పార్టీ నాకు అప్పగించిన బాధ్యతలను తూచాతప్పకుండా పాటించాను.
ఇదంతా పక్కన పెడితే మేము మొదటి నుంచి అడుగుతున్నది కానీ ఇప్పుడు అడిగినదికానీ జిల్లాలో పలు నియోజక వర్గాల్లో ఉన్న మా సొంత క్యాడర్ కు ఏ రోజునా అక్కడి స్థానిక నాయకత్వం సముచిత స్థానం కల్పించక పోగా పలు ఇబ్బందులకు గురిచేసారు. ఇదే విషయాన్నీ పలు సార్లు మీ దృష్టికి తీసుకు వచ్చినప్పటికీ మీరు తగిన న్యాయం చేస్తానని చెప్పిన వాస్తవ పరిస్థితుల్లో అది కార్యరూపం దాల్చలేదు. ఇక పై న్యాయం జరుగుతుందన్న నమ్మకం కూడా కనిపించడం లేదు. ఇక వేలాదిగా ఉన్న మా అనుచరగణం పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. ఇక పై అవమానాలు పడే ఓపిక మాకు లేదు అని పలుమార్లు వాళ్ళు నా దగ్గర విన్నవించుకున్నారు. గత 40ఏళ్లుగా మాకుటుంబానికి వెన్నంటిఉన్న అభిమానుల మనోభావాలే మాకు అత్యంత ముఖ్యం. వాళ్ళ వల్లే మేము ఇక్కడ ఉన్నామా నా అధిష్టానం నా అభిమానులే అని మరొక్క సరి తెలియజేసుకుంటూ తెలుగు యువత అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నాను"అని లేఖలో పేర్కొన్నారు దేవినేని అవినాష్.