ఒంగోలు: నేటి బాలలే రేపటి మన సమాజ నిర్మాతలు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని పీవీఆర్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మనబడి నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమ పైలాన్ను ఆవిష్కరించిన అనంతరం జగన్ మాట్లాడారు. తొలి దశలో 15,715 స్కూళ్లను అభివృద్ధి చేస్తామన్నారు. మన పిల్లలకు ఇంగ్లీష్ రాకపోతే భవిష్యత్ ఏమిటి? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 33 శాతం మంది పిల్లలకు చదువు రాని పరిస్థితి ఉందన్నారు. పేదరికం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రపంచంతో పోటీపడేలా పిల్లల్ని సిద్ధం చేయాలా వద్ద అని ప్రశ్నించారు. ఓ మంచి నిర్ణయం తీసుకోకపోతే తలరాతలు మారవన్నారు. పేదలు చదువుకునే బడులను దేవాలయాలుగా మార్చొద్దా? అని ప్రశ్నించారు. మార్పు రావాలంటే సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలన్నారు. పదేళ్ల తర్వాత రోబోటిక్స్ కీలకం కానున్నాయన్నారు. ప్రపంచంతో పోటీపడేలా పరిస్థితులు సృష్టించకపోతే మన పిల్లలు డ్రైవర్లు, కూలీలుగా మారుతారన్నారు.