ఏపీలో ఇసుక కొరత, ఇంగ్లీష్ మీడియంపై దుమారం రేగుతోంది. ఐతే వీటితో పాటు వైసీపీ రంగులపైనా ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. గ్రామ సచివాలయాలు, స్కూళ్లు సహా పలు భవనాలకు వైసీపీ జెండా రంగులు వేయడంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇటీవల ఓ గ్రామ సచివాలయంపై ఉన్న జాతీయ జెండాను చెరిపేసి వైసీపీ రంగులద్దారు. దానిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో మళ్లీ త్రివర్ణాలను వేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ రంగులను బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మి నారాయణ టార్గెట్ చేశారు. ఏపీలో వైసీపీ పిచ్చి పరాకాష్టకు చేరిందంటూ విరుచుకుపడ్డారు కన్నా.
వైసీపీ నేతలు రాష్ట్రంలో బడిని, గుడినీ వదలకుండా పార్టీ రంగులు వేస్తున్నారని ధ్వజమెత్తారు. అవకాశం ఉంటే ఇసుకకి, ఇంద్రధనస్సుకి కూడా వైఎస్సార్సీపీ రంగులేసేలా ఉన్నారని ట్విటర్ వేదికగా సెటైర్లు వేశారు. అంతేకాదు హిందూ ఆలయాల్లో అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహిస్తున్నారంటూ తీవ్రంగా మండిపడ్డారు కన్నా లక్ష్మీ నారాయణ. అన్నవరంలో అన్యమత ప్రచారం, భవానీ ఐలాండ్లో అర్చిపై బొమ్మల ఏర్పాటు, భీమిలి ఉత్సవ్లో మతపరమైన స్టాల్స్ ఏర్పాటు వైసీపీ మతవ్యాప్తిని సూచిస్తున్నాయని ధ్వజమెత్తారు ఏపీ బీజేపీ చీఫ్.
రాష్ట్రంలో వైసీపీ పిచ్చి పరాకాష్టకు చేరింది.
బడిని,గుడినీ వదలని వైసీపీవాళ్ళు అవకాశం ఉంటే ఇసుకకి,ఇంద్రధనస్సుకి కూడా రంగులేసేలా ఉన్నారు.
అన్నవరంలో అన్యమత ప్రచారం,భవానీ ఐలాండ్లో అర్చిపై బొమ్మల ఏర్పాటు,భీమిలి ఉత్సవ్ లో మతపరమైన స్టాల్స్ ఏర్పాటు వైసీపీ మతవ్యాప్తిని సూచిస్తున్నాయి. pic.twitter.com/v34leSFvWH
— Kanna Lakshmi Narayana (@klnbjp) November 13, 2019