టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తనకు నచ్చినప్పుడు రిటైర్మెంట్ ప్రకటించే హక్కుని సంపాదించాడని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి తెలిపాడు. బంగ్లాదేశ్తో సిరిస్కు భారత జట్లను ఎంపిక చేసేందుకు గాను ఎమ్మెస్కే ప్రసాద్ నాయకత్వంలోని సెలక్షన్ కమిటీ ముంబైలో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని భవిష్యత్తు గురించి కూడా చర్చించినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్తో సిరీస్కు జట్టు ఎంపికకు ముందే ధోనీతో మాట్లాడామని ఎమ్మెస్కే తెలిపాడు. యువ ఆటగాళ్లను ప్రోత్సహించాలన్న ఆలోచనలకు ధోని సైతం మద్దతు తెలిపాడని అన్నాడు. రిటైర్మెంట్పై తుది నిర్ణయం ధోనీదేనని... మేం పూర్తిగా భవిష్యత్తుపై దృష్టి పెట్టామని ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పుకొచ్చాడు. అంతేకాదు బంగ్లాదేశ్తో సిరిస్కు రిషబ్ పంత్తో పాటు యువ వికెట్ కీపర్ సంజూ శాంసన్కు సెలక్టర్లు చోటిచ్చారు. ఈ నేపథ్యంలో ధోని రిటైర్మెంట్ మరోసారి తెరపైకి వచ్చింది. ధోనీని తన ఫేర్వెల్ సిరిస్కే సెలక్టర్లు ఎంపిక చేస్తారంటూ వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ధోని భవితవ్యంపై చర్చించే వారిపై రవిశాస్త్రి మండిపడ్డాడు. రవిసాస్త్రి మాట్లాడుతూ "ధోనీ రిటైర్మెంట్పై మాట్లాడే వారిలో సగం మందికి షూలేస్ కూడా కట్టుకోవడం సరిగా రాదు. అతను దేశం కోసం ఏమి సాధించాడో చూడండి" అని రవిశాస్త్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. "అతడు క్రికెట్కు గుడ్బై పలకాలని వారు ఎందుకు తహతహలాడుతున్నారు? బహుశా, చర్చించడానికి వేరే విషయాలు లేక అతడి గురించి చర్చిస్తున్నారా? అతడు భవిష్యత్తులో క్రికెట్కు వీడ్కోలు పలుకుతాడని అందరికీ తెలుసు. సమయం వచ్చినప్పుడు అతడే నిర్ణయం తీసుకొంటాడు. కాబట్టి, అది జరిగినప్పుడు అది జరగనివ్వండి" అని రవిశాస్త్రి అన్నాడు.