తెదేపా అనుబంధ సంఘాల నుంచే ప్రక్షాళన ప్రారంభం. మహిళలు, యువత, బడుగుబలహీన వర్గాలకే కార్యవర్గాలలో ప్రాధాన్యం. తెలుగుదేశం పార్టీ పూర్వవైభవం సంతరించుకునే దిశగా చర్యలు ఆరంభమయ్యాయి. అనుబంధసంఘాల కార్యవర్గాల ఏర్పాటును ముందుగా ప్రారంభించనున్నారు. విజయదశమి నుంచి ప్రారంభించి.. నవంబరు నెలాఖరుకు అన్ని అనుబంధ సంఘాల కార్యవర్గాలను ఎన్నుకోనున్నారు. ఆ తరువాత తెలుగుదేశం పార్టీలోనూ సమూల మార్పులకు శ్రీకారం చుట్టనున్నారు.
అనుబంధ సంఘాల కార్యవర్గాలలో యువత, మహిళలు, బడుగు, బలహీనవర్గాలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ దిశగా చర్యలు తీసుకునేందుకు నిర్ణయించిన కీలక సమావేశం గురువారం గుంటూరు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాల బాధ్యులూ పాల్గొన్నారు. టీడీపీకి పూర్వ వైభవం తేవడానికి ఏం చర్యలు తీసుకోవాలో సమావేశంలో చర్చించారు.
పార్టీకి ఉన్న అని అనుబంధ సంఘాలకు నూతన కార్యవర్గాలను నియమించాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియ దసరాకు ప్రారంభించి నవంబరు నెలాఖరుకు పూర్తి చేయాలని చంద్రబాబు సూచించారు. అనుబంధ సంఘాలలో 33 శాతం యువత, 33 శాతం మహిళలు, 50 శాతం బడుగు.. బలహీనవర్గాల వారికి అవకాశం ఇవ్వాలని తీర్మానించారు.సామాజికవర్గాల జనాభా ఆదారంగా వారికి పదవులలో అవకాశాలు ఇవ్వనున్నారు.అలాగే కార్యవర్గంలోకి ఎన్నికైన వారి పనితీరును నిర్ణీత సమయంలోగా పరిశీలించనున్నారు. పనితీరు బాగాలేని వారిని కార్యవర్గంలోని మెజారిటీ సభ్యుల నిర్ణయంతో రీకాల్ చేయాలనే కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటివరకూ తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాలన్నీ జిల్లా కమిటీలుగానే ఉండేవి. అయితే ఇకపై పార్లమెంటు స్థానాల వారీగా కమిటీలు ఏర్పాటు చేయబోతున్నారు. నవంబరు నెలాఖరుకు అన్ని సంఘాల కార్యవర్గాలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయడం పూర్తి చేయనున్నారు. అనుబంధ సంఘాల ప్రక్షాళనతోనే తెలుగుదేశం పార్టీలోనూ కీలక మార్పులు జరిగే అవకాశాలున్నాయి.
ఈ సమావేశంలో మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మకాయల చినరాజప్ప, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, ఎమ్మెల్సీలు టీడీ జనార్థన్, వీవీవీ చౌదరి, మంతెన సత్యనారాయణరాజు, టీడీపీ నాయకులు బీద రవిచంద్ర, గణబాబు, వంగలపూడి అనిత, గౌతు శిరీష, నజీర్ అహ్మద్, ఇంతియాజ్ అహ్మద్, ఎం.ఎస్.రాజు, బ్రహ్మం చౌదరి కీలక నేతలతోపాటు అనుబంధసంఘాల బాధ్యులూ పాల్గొన్నారు.