తమ పార్టీకి చెందిన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అరెస్టుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రజల తరఫున పోలీస్ స్టేషన్కు వెళ్లిన రాపాకపై కేసులు పెట్టడం సరికాదన్నారు. ప్రజలు అడిగితే వారికి మద్దతుగా వరప్రసాద్ వెళ్లారని.. అలాంటి వ్యక్తిపై కేసులు పెట్టడమేంటని ప్రశ్నించారు. నెల్లూరు జిల్లాలో వైకాపా ఎమ్మెల్యే జర్నలిస్ట్పై దాడికి పాల్పడితే ఎలాంటి చర్యలూ తీసుకోలేదని విమర్శించారు. మలికిపురం ఘటనలో గోటితో పోయేది గొడ్డలిదాకా తెచ్చారని వ్యాఖ్యానించారు. ఈ ఘటన శాంతిభద్రతల సమస్యగా మారకుండా అధికార యంత్రాంగం పరిష్కరించాలన్నారు. జనసేన కార్యకర్తలు, నాయకులు సంయమనంతో ఉండాలని పవన్ విజ్ఞప్తి చేశారు. పరిస్థితి అదుపుతప్పి.. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిన పక్షంలో తానే స్వయంగా వస్తానన్నారు. మలికిపురం ఘటనపై ఎప్పటికప్పుడు పార్టీ ముఖ్య నేతలతో సమీక్షిస్తున్నట్టు పవన్ చెప్పారు.