శ్రీవారి ఆలయంలో ఆగస్టు 11 నుండి 13వ తేదీ వరకు జరుగనున్న పవిత్రోత్సవాలకు ఆగస్టు 10వ తేదీ శనివారం రాత్రి 9 నుంచి 10 గంటల నడుమ ఘనంగా అంకురార్పణం జరుగనుంది. ఈ సందర్భంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సేనాధిపతివారిని వసంతమండపానికి వేంచేపు చేసి మ త్సంగ్రహణం, ఆస్థానం నిర్వహిస్తారు. ఆ తరువాత పవిత్రమండపంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు చేపడతారు.
దోష నివారణ ఉత్సవాలు : పవిత్రోత్సవాలను ‘దోష నివారణ’, ‘సర్వయజ్ఞ ఫలప్రద’, ‘సర్వదోషోపశమన’, ‘సర్వతుష్టికర’, ‘సర్వకామప్రద’ తదితర పేర్లతో పిలుస్తారు. పవిత్రం, ఉత్సవం అనే రెండు పదాల కలయిక వల్ల పవిత్రోత్సవం ఏర్పడింది. చారిత్రక ఆధారాల ప్రకారం శ్రీస్వామివారి ఉత్సవమూర్తులకు కావలసిన పవిత్రాలు చేయడానికిగాను శ్రేష్ఠమైన జాతి పత్తి మొక్కలను అత్యంత పవిత్రమైన దైవమొక్కగా భావించే తులసి పెంచడానికి ఉపయోగించే పెరటి భూమిలో పెంచడం విశేషం.
పవిత్రాలను తయారు చేయడానికి 20 మూరల పట్టుదారంగానీ లేదా 200 మూరల నూలుదారం గానీ ఉపయోగిస్తారు. ఈ దారాలకు తెలుపుతో పాటు నలుపు, ఎరుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ రంగులు అద్దకం చేస్తారు. ఆలయ మొదటి ప్రాకారంలో గల వగపడి వరండాలో ఉత్తరం వైపున రాతి గోడపై పవిత్రోత్సవాల లెక్కలకు సంబంధించిన పురాతన శాసనం లభ్యమైంది. ”పవిత్ర తిరునాల్” పేరిట నిర్వహించిన ఈ ఉత్సవాల్లో ఉపయోగించిన వస్తువుల జాబితా, వాటి ధరల వివరాలున్నాయి.