ప్రియుడి ఇంటిముందు ఓ ప్రియురాలు మౌన దీక్షకు దిగింది. కృష్ణాజిల్లాలోని ఇబ్రహీంపట్నానికి చెందిన జోసఫ్రాజు తనని మోసం చేశడాని భాగ్యలక్ష్మి అనే యువతి సోమవారం అర్ధరాత్రి నుంచి నిరసన చెపట్టింది. ఎన్టీటీపీఎస్లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న జోసఫ్రాజుకు.. భాగ్యలక్ష్మితో రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఆమె ఇబ్రహీంపట్నంలో బ్యూటీపార్లర్ నడుపుతుంది. వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. అలాగే కొన్నాళ్ళ పాటు సహజీవనం కూడా చేశారు. తీరా పెళ్లి పేరు ఎత్తగానే అతను ముఖం చాటేశాడు.
దీంతో బాధితురాలు జోసఫ్రాజు నమ్మించి మోసం చేశాడని పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది. అయితే వీరి మధ్య తిరిగి సఖ్యత ఏర్పడడంతో మరలా స్నేహం చేయటం ప్రారంభించారు. మళ్లీ పెళ్లి పేరు ఎత్తగానే పాత బుద్దిని చూపించాడు రాజు. అంతేకాకుండా మరో అమ్మాయితో వివాహనికి సిద్దమయ్యాడు. ఈ నేపథ్యంలో మంగళవారం జోసఫ్కు వివాహం అని తెలుసుకున్న భాగ్యలక్ష్మి ప్రియుడి ఇంటికి వచ్చేసింది. అతని కుటుంబ సభ్యులు ఇంటి దగ్గర లేకపోవడంతో అక్కడే బైఠాయించింది.
చివరకు ఈ వివాదం పోలీస్ స్టేషన్కు చేరింది. జోసఫ్కు 2018లోనే వివాహం అయ్యిందని అతని తండ్రి శామ్యూల్ పోలీసులకు తెలిపాడు. సాక్ష్యంగా అతని వివాహనికి సంబంధించిన ఫొటోలు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ను చూపించాడు. భాగ్యలక్ష్మితో గతంలోనే రాజీ చేసుకున్నామని పోలీసులకు తెలిపారు. అయితే అవన్నీ అబధ్దాలని జోసఫ్కు రెండు రోజుల క్రితమే వివాహం అయ్యిందని బాధితురాలు చెబుతోంది. అతనితో పెళ్లి జరగని పక్షంలో ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తోంది. దీనిపై స్పందించిన పోలీసులు 2018లోనే ఈ వివాదంపై కేసు నమోదు చేశామని, ప్రస్తుతం ఇది కోర్టు పరిదిలో ఉన్నట్లు వివరించారు.