కడప: కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామస్వామి కల్యాణ మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా శ్రీరామ నవమి రోజు సీతారాముల కల్యాణం నిర్వహించగా... ఇవాళ రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య పున్నమి చంద్రుని వెలుగుల్లో వివాహ వేడుకను కనులపండువగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సుమారు లక్ష మంది భక్తులు హాజరవుతారన్న అంచనాతో కల్యాణ వేదికను నిర్మించారు. లక్షలాది మంది భక్తులు కల్యాణ వేడుకలు చూసేలా స్వామివారి కల్యాణ వేదిక వద్ద ఏర్పాట్లు ముమ్మరం చేశారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని జర్మనీ తరహాలో షెడ్లను ఏర్పాటు చేశారు. కల్యాణ వేదిక సమీపంలో సామాన్య భక్తులతోపాటు వీఐపీలు, ప్రముఖులు, కల్యాణ వేడుకలు తిలకించేలా భారీకేడ్లు ఏర్పాటు చేశారు. మూడు ప్రాంతాల్లో షెడ్లను సుందరంగా తీర్చిదిద్దారు.స్వామివారి కల్యాణం పండువెన్నెలలో జరిగేలా చర్యలు చేపట్టారు.