ఏపీలో ఎన్నికల తీరుపై కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశామని.. దానిపై ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం రాలేదని,ఎన్నికల సంఘం తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు చంద్రబాబు. ఈవీఎంలు, వీవీ ప్యాట్లపై తమకు చాలా అనుమానాలున్నాయని 50 శాతం వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించాల్సిందేనని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి మార్కెట్లలో సైతం మాట్లాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు . కోట్లు ముట్టచెపితే ఎమ్మెల్యేగా గెలిపిస్తామంటూ బేరాలు ఆడే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే తాను ఈవీఎంలపై పోరాటం చేస్తున్నానని స్పష్టం చేశారు. ఏపీలో టీడీపీ గెలుపు పై ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు చంద్రబాబు.ఎన్నికలు సమయంలోనే ఈసీకి రాష్ట్రంపై అధికారం ఉంటుందని.. ప్రస్తుతం రాష్ట్ర పాలనలో జోక్యం చేసుకునే హక్కు ఈసీకి లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు సృష్టించాలని చూస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.