నేనేసీఎం అవుతాను.. ఆంధ్రాను అమెరికా చేస్తాను.. నరసాపురాన్ని నార్త్ అమెరికా చేస్తాను’.. ఆయన మరెవరో కాదు కేఏ పాల్. ప్రజాశాంతి పార్టీ తరఫున ఈ సార్వత్రిక ఎన్నికల్లో నరసాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. తొలుత నుంచి తన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ వచ్చిన ఆయన మునుపు వున్న జోష్ను కోల్పోయినట్టు కనిపిస్తున్నారు. బోలెడన్ని నవ్వులు కురిపించిన ఆయన ఓ సందర్భంలో కన్నీరు కూడా కార్చారు. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడిన అది పెద్ద సంచలనం అయ్యాయి. తాజగా ఆయన మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నరసాపురం లోక్ సభ పరిధిలో 60 శాతం ఓట్లు తనకే పడ్డాయి కానీ, ఈవీఎంలలో అవినీతి వల్ల వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయని కేఏ పాల్ ఆరోపించారు. నరసాపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన పాల్ మాట్లాడుతూ, ఎన్నికల సంఘం ప్రధాని మోదీ చేతుల్లో ఉందని ఆరోపించారు. అవినీతిపై పోరాడేందుకు యువత తనతో కలిసి రావాలని, యువత తన వెంట వస్తే దీక్ష చేపడతానని పిలుపు నిచ్చారు. ఇదిలావుండగా ఏపీ ముఖ్యంమంత్రి చంద్రబాబు కూడా ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని, ఈ విషయమై సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడానికి ఢిల్లీ వెళ్తున్నట్టు ప్రకటించారు.