ఉత్తరానక్షత్ర లగ్నంలో జన్మించిన హరిహరసుతుడు, శబరిగిరీశుడు అయిన అయ్యప్పస్వామి పుట్టినరోజు సందర్భంగా గొల్లపూడి అయ్యప్ప స్వామి దేవస్థానంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 5 గంటలకు గణపతి హోమం అనంతరం కలశపూజ, అష్టద్రవ్య మహాభిషేకం కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకులు ఏ.పి.శ్రీనాథ్, అర్చకులు ఆర్.పి.హరిహరన్లు శాస్త్రోక్తకంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలనంతరం స్వామివారికి మహా నైవేద్యం సమర్పించారు. సుమారు 1500 మంది భక్తులు తరలివచ్చి భక్తిశ్రద్ధలతో అయ్యప్పను ఆరాదించారు. స్వామియే శరణమయ్యప్ప అంటూ భక్తుల శరణుఘోషతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. పూజలు అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలను ఆలయ ఛైర్మన్ గెల్లి మోహన్రావు, సభ్యులు గెల్లి లోక్నాధ్. కల్వ వెంకటేశ్వరరావు, తూనుగుంట్ల శ్రీనివాసరావు తదితరులు పర్యవేక్షించారు. రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తూ నామినేషన్ వేసేందుకు బయలుదేరిన మైలవరం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దేవినేని ఉమామహేశ్వరరావు అయ్యప్ప ఆలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.