నెల్లూరు జిల్లాకు ఎంతో అవసరమైన దగదర్తి విమానాశ్రయ పనులు కూడా త్వరలో ప్రారంభిస్తామని ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. జిల్లాలో పరిశ్రమలు, విమానాశ్రయ ఏర్పాటుపై వివిధ శాఖల అధికారులతో ఆదివారం మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, డాక్టర్ పొంగూరు నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ... నగరం చుట్టూ ఉన్న రైసు మిల్లులను ఇతర ప్రాంతాలకు తరలించాలని భావిస్తున్నామని తెలిపారు.కృష్ణపట్నం పోర్టు, కిసాన్ సెజ్లోకి మార్చాలని భావిస్తున్నామని చెప్పారు.
రైసు మిల్లుల అసోసియేషన్లతో చర్చించి త్వరగా నిర్ణయం తీసుకుంటామని అన్నారు. జిల్లాకు భారీ సంఖ్యలో పరిశ్రమలు రానున్నాయని తెలిపారు. విమానాశ్రయం ఎంతో అవసరం ఉందన్నారు. విమానాశ్రయానికి 1379 ఎకరాల భూములు అవసరమని వివరించారు. విమానాశ్రయం కోసం తీసుకున్నందుకు కొంత భూమికి పరిహారం ఇచ్చారని.. ఇంకా కొంత భూమిని సేకరించాల్సి ఉందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.