ఈ రాష్ట్రంలో క్రెడిబులిటి ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు.. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులతో ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇవాళ(సోమవారం) విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయంలో షర్మిల సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమీక్ష సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ... వైసీపీ, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చేతులెత్తేసిందని ఆ పార్టీకు క్రెడిబులిటి లేదని ప్రజలకు అర్థమైందని అన్నారు. వైసీపీపై ప్రజలకు నమ్మకం పోయిందని విమర్శించారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న క్రెడిబులిటితో వారి సమస్యలపై అనునిత్యం పోరాటాలు చేయాలని, వారిలో భరోసా నింపే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించామని అన్నారు. ప్రతి వారం రెండు సార్లు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి క్యాడర్లో నూతన ఉత్తేజం నింపాలని, కార్యవర్గానికి సూచించినట్లు షర్మిల వెల్లడించారు.