ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీటీడీ ఈవో వ్యాఖ్యలు బాధించాయి.. తెలంగాణ ఎమ్మెల్యే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 21, 2024, 07:02 PM

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తిరుమలలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారి దర్శనానికి తెలంగాణ సిఫార్సు లేఖల్ని తీసుకోకపోవడం బాధాకరమని.. డయల్ యువర్ ఈవోలో తెలంగాణ ఎమ్మెల్యేల లేఖలకు అనుమతి ఇవ్వమని చెప్పడం బాధాకరమన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో చంద్రబాబు రెండు ప్రాంతాలు.. రెండు కళ్లని చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేశారు. తెలంగాణ ఒక కన్ను ఆంధ్ర ఇంకో కన్ను అని మాట్లాడిన చంద్రబాబు.. ఇప్పుడు ఒక కన్ను తీసేసుకున్నారా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.


 తెలంగాణలో యాదగిరిగుట్ట, భద్రాచలంలో ఆంధ్ర నాయకులు ఇచ్చే లేఖలకు అనుమతి ఉందని.. అక్కడ దర్శనాలు కల్పిస్తున్నట్లు అనిరుధ్ రెడ్డి చెప్పారు. తెలంగాణ లేఖలపై తిరుమల దర్శనాల విషయంలో ఎందుకు చిన్న చూపు చూస్తున్నారని.. తమ సొంత మనుషులు, పార్టీ కార్యకర్తలకు కొండపై కనీసం రూమ్‌లు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉంటే టీడీపీ వాళ్లు హైదరాబాద్‌లో ఆశ్రయం పొందుతారని.. టీడీపీ ప్రభుత్వం అక్కడ అధికారంలో ఉంటే వైఎస్సార్‌సీపీ వాళ్లు వచ్చి ఇక్కడ ఆశ్రయం తీసుకుంటారని వ్యాఖ్యానించారు.


ఆంధ్రప్రదేశ్ వాళ్లు హైదరాబాద్‌లో వ్యాపారాలు చేసుకుంటున్నా.. ఏనాడూ ఒక్క మాట అనలేదన్నారు అనిరుధ్ రెడ్డి. తెలంగాణ ఎమ్మెల్యేలం అందరం కలిసి ఆంధ్రప్రదేశ్ వాళ్లని రాష్ట్రంలోకి రావొద్దని తీర్మానం చేసుకుంటే.. ఆ బాధ ఎలా ఉంటుందో బాగా తెలుస్తందన్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖల్ని తిరుమలలో అనుమతించకపోతే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలతో.. ఏపీ ప్రభుత్వం బాధపడాల్సి వస్తుందన్నారు. రెండు రాష్ట్రాల వారు అన్నదమ్ములు అన్నారు.. కేవలం వ్యాపారం కోసం హైదరాబాద్‌కు రావొద్దని.. నిజమైన అన్నదమ్ములాగే ఉందామన్నారు అనిరుధ్ రెడ్డి. తిరుమలలో దర్శనాలు, సిఫార్సు లేఖల అంశంపై తెలంగాణ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.


తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫార్సు లేఖల్ని తిరుమలలో అనుమతించకపోవడంపై గతంలో కూడా చర్చ జరిగింది. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి.. ఈ అంశంపై రిక్వెస్ట్ చేశారు.. తెలంగాణ ఎమ్మెల్యేల లేఖల్ని అనుమతించాలని కోరారు. అయితే టీటీడీతో చర్చించి ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు స్పీకర్ ప్రసాద్ చెప్పారు. తాజాగా ఎమ్మెల్యే అనిరుధ్ తిరుమల దర్శనాలపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. మరి ఈ లేఖల అంశంపై టీటీడీ, ఏపీ ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇస్తుందన్నది చూడాలి. మొత్తం మీద తిరుమలలో తెలంగాణ సిఫార్సు లేఖల అంశం రెండు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com