ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శబరిమలకు పోటెత్తిన భక్తులు.. 7 గంటలకుపైగా క్యూలైన్లలోనే పడిగాపులు

national |  Suryaa Desk  | Published : Sat, Oct 19, 2024, 11:08 PM

శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. కేరళ వాసులే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా శబరిమలకు చేరుకుంటున్నారు. దీంతో అక్కడ భారీగా రద్దీ నెలకొంది. అయితే సరైన సౌకర్యాలు కల్పించడంలో ట్రావెన్‌కోర్ దేవస్థానం, కేరళ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యాయని.. అయ్యప్ప భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్నా.. కనీసం తాగునీరు లాంటి మౌలిక వసతులు కల్పించడం లేదని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయ్యప్ప దర్శనం కోసం భక్తులు భారీగా తరలిరావడంతో.. 7 గంటలకుపైగా క్యూలైన్లలోనే పడిగాపులు కాస్తున్నారు.


శబరిమల అయ్యప్ప క్షేత్రంలో ఈనెల 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు భక్తులకు ప్రత్యేక దర్శనాలు కల్పిస్తూ.. ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. శబరిమలలో నెల దర్శనం, నక్షత్ర దర్శనాల కోసం అయ్యప్ప భక్తులు ముందుగా టికెట్లు బుక్ చేసుకుని.. భారీగా తరలివచ్చారు. అయితే భారీగా వచ్చిన భక్తులతో రద్దీ నెలకొనడంతో 7 గంటలకుపైగా క్యూలైన్లలోనే పడిగాపులు కాస్తున్నారు. అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులను అధికారులు అనుమతించకపోవడంతో క్యూలైన్లలోనే తోపులాటలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


ఇక క్యూలైన్లలో చాలా మంది పిల్లలు, వృద్ధులు, అయ్యప్ప మాలదారులు ఉన్నారు. అంతేకాకుండా శబరిమలలో ప్రస్తుతం ఓవైపు భారీగా వర్షాలు కురుస్తుండగా.. మరోవైపు.. చలిగాలులు వీస్తున్నాయి. ఇక భారీగా తరలివచ్చిన వారికోసం ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదని భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భోజనాలు లేకపోవడంతో పాటు కనీసం తాగునీరు కూడా లేకపోవడంతో అయ్యప్ప భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు వ్యతిరేకంగా క్యూలైన్లలోనే భక్తులు నిరసన చేస్తున్నారు.


శబరిమలలో నవంబరు 15వ తేదీ నుంచి డిసెంబరు 26వ తేదీ వరకు మండల పూజలు కొనసాగనున్నాయి. అనంతరం రెండు రోజుల పాటు శబరిమల ఆలయాన్ని మూసివేయనున్నారు. ఆ తర్వాత డిసెంబరు 30వ తేదీ నుంచి జనవరి 20వ తేదీ వరకు మకర విళక్కు పూజలు జరగనుండగా.. చివరిరోజు పడిపూజతో దర్శనాలు ముగియనున్నాయి. జనవరి 14వ తేదీన మకర సంక్రాంతి రోజున మకర జ్యోతి (మకర విళక్కు) దర్శనం.. కలగనుంది. భక్తుల రద్దీ నేపథ్యంలో దర్శన వేళలను ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు పెంచింది. తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అయ్యప్ప దర్శనాలు కొనసాగనుండగా.. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు బ్రేక్ ఇవ్వనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com