ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో ప్రభుత్వ టీచర్లకు అద్భుత అవకాశం.. వెంటనే దరఖాస్తు చేస్కోండి, 25 వరకే ఛాన్స్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 18, 2024, 09:32 PM

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ టీచర్లకు ముఖ్యమైన గమనిక. ఎస్‌సీఈఆర్టీ (రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి)లో డిప్యుటేషన్‌పై పనిచేసే పోస్టులకు దరఖాస్తు చేసేందుకు పురపాలక ఉపాధ్యాయులకు అవకాశం కల్పించింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది.ఈ పోస్టులకు సంబంధించి.. ప్రభుత్వ, జిల్లా పరిషత్తు పాఠశాలల్లోని వారికే మొదట అవకాశం కల్పించారు. ఇటు పురపాలక టీచర్లకూ డిప్యుటేషన్‌ ఇవ్వాలని విన్నవించడంతో.. ఈ మేరకు వారికి కూడా అనుమతి ఇచ్చారు. విద్యా శాఖ ఎస్‌సీఈఆర్టీలో 34 పోస్టులను డిప్యుటేషన్‌పై భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ ఇచ్చింది.


ఆసక్తి ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ సూచించింది.. ఈనెల 25లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల్ని సమర్పించాలి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన దరఖాస్తుల్ని 28వ తేదీ నుంచి 30 వరకు పరిశీలన.. నవంబరు 4, 5వ తేదీల్లో సిబ్బందికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అలాగే దరఖాస్తు చేసుకునేవారికి.. ఈ ఏడాది సెప్టెంబరు 28నాటికి 15 ఏళ్ల బోధన అనుభవం ఉండాలి. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్నవారికి, ఎంఫిల్, పీహెచ్‌డీ వారికి ప్రాధాన్యం ఉంటుంది.


మరోవైపు నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలను వెంటనే చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. రాష్ట్రంలో కరోనా, సహజ మరణాలతో.. దాదాపు 3 వేల మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు చనిపోయారని గుర్తు చేశారు. అలాగే పంచాయతీరాజ్‌ శాఖలో కారుణ్య నియామకాలు అమలు చేయకపోవడంతో ఆయా కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి అన్నారు. కారుణ్య నియామకాలకు సంబంధించి అర్హులైన కుటుంబ సభ్యుల్ని సింగిల్ టైమ్ సొల్యూషన్ కింద ఉద్యోగాలు కల్పించాలని కోరారు. ఈ మేరకు కేబినెట్‌లో చర్చించాలని కోరారు.. అలాగే 12వ పీఆర్సీ కమిషనర్‌ నియామకంతోపాటు 30 శాతం మధ్యంతర భృతి చెల్లించాలని, పెండింగ్‌ బకాయిలు విడుదల చేయాలని కూడా రిక్వెస్ట్ చేశారు.


మరోవైపు ఎయిడెడ్‌ బోధన, బోధనేతర సిబ్బంది కుటుంబసభ్యులకు కారుణ్య నియామకాలు కల్పించాలని కూడా ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఎయిడెడ్‌ బడుల్లో పనిచేస్తున్న 3,005 మందికి ఆరోగ్యకార్డులు ఇవ్వాలి అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వంలో విలీనమైన సిబ్బందికి పదోన్నతుల సర్వీస్‌ సమస్య పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేశారు. అంతేకాదు తెలుగు, హిందీ, సంస్కృతం, పీఈటీ ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పించాలని కోరారు. విద్యార్థులు లేని బడుల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ప్రభుత్వ పాఠశాలల్లో శాశ్వతంగా సర్దుబాటు చేయాలని కూడా ప్రభుత్వాన్ని కోరారు. పంచాయతీరాజ్‌శాఖలో కారుణ్య నియామకాలకు సంబంధించి ఇటీవల పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ అంశాన్ని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.. కారుణ్య నియామకాలను పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com