ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు సార్.. ఇవి చూసైనా మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 18, 2024, 09:31 PM

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల.. ఏం చేసినా కాస్త వినూత్నంగా ఆలోచిస్తారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడమైనా, ప్రజల తరఫున పోరాటాలైనా ఆమె ఓ డిఫరెంట్ స్టైల్‌ ఫాలో అవుతుంటారు. గతంలో కూడా కేసీఆర్‌కు, వైఎస్ జగన్‌కు, చంద్రబాబుకు సెటైరికల్‌గా పలు గిఫ్టులు పంపించారు వైఎస్ షర్మిల. ఇప్పుడు మరోసారి అలాంటి తరహా పోరాటానికై రెడీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‍ మహిళల నుంచి చంద్రబాబుకు పోస్టు కార్డులు పంపించాలని వైస్ షర్మిల నిర్ణయించారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని వైఎస్ షర్మిల ఆరోపిస్తున్నారు. సూపర్ సిక్స్ అంటూ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని.. పాలన చేపట్టి నాలుగు నెలలు దాటిపోయినా హామీల అమలును పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. ఇక ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ విషయంలోనూ వాయిదాలు వేస్తున్నారని విమర్శిస్తున్నారు.


ఈ క్రమంలోనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పోస్టు కార్డు ఉద్యమాన్ని వైఎస్ షర్మిల ప్రారంభించారు. ఇవాళ్లి నుంచి కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో సీఎం నారా చంద్రబాబు నాయుడికి పోస్టు కార్డులు పంపుతామని తెలిపారు. విజయవాడ నుంచి తెనాలికి ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన వైఎస్ షర్మిల.. బస్సులోని ప్రయాణికులతో ముచ్చటించారు. ఉచిత బస్సు ప్రయాణం హామీ గురించి ప్రయాణికుల స్పందనను తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఫ్రీ బస్సు హామీ కోసం ఎదురుచూస్తున్నట్లు కొంతమంది మహిళలకు వైఎస్ షర్మిల వద్ద చెప్పుకున్నారు. దీంతో ఉచిత బస్సు హామీ అమలు కోసం అందరం కలిసి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని షర్మిల వారికి సూచించారు. ఇందుకోసం సీఎం చంద్రబాబుకు పోస్టు కార్డులు రాయాలని వైఎస్ షర్మిల సూచించారు.


మరోవైపు ఏపీలో టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడిచిందన్న వైఎస్ షర్మిల.. తెలంగాణ, కర్నాటకలలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే హామీని అమలు చేసినట్లు గుర్తుచేశారు. అయితే ఏపీలో మాత్రం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలూ పూర్తైనప్పటికీ హామీ అమలుపై స్పష్టత ఇవ్వడం లేదన్నారు.


ఆంధ్రప్రదేశ్‌లో రోజుకు 20 లక్షల మంది మహిళలు బస్సులో ప్రయాణిస్తున్నారన్న షర్మిల.. దీని ద్వారా ఆర్టీసీకి రోజుకు 7 కోట్లు చొప్పున.. నెలకు రూ.300 కోట్లు ఆదాయం వస్తోందన్నారు. ఉచిత బస్సు తెస్తే ఈ రూ.300 కోట్లు ఆర్టీసీకి ఇవ్వాల్సి వస్తుందనే భయమా అని ప్రశ్నించారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం ఉచిత బస్సు హామీని నెరవేర్చడానికి కసరత్తు కూడా జరిపింది. ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను పరిశీలించేందుకు కమిటీ కూడా వేయాలని భావించింది. ఇక ఆగస్ట్ 15 నుంచి పథకం ప్రారంభిస్తారనే వార్తలు వచ్చాయి. అయితే ఆ దిశగా అడుగు ముందుకు పడలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com