ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మద్యం వ్యాపారాల్లో ఆ నేతలకు మినహాయింపు.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 18, 2024, 09:29 PM

ఏపీలో నూతన మద్యం విధానం, ఇసుక పాలసీలు అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మద్యం, ఇసుక వ్యవహారాల్లో కూటమి ప్రజాప్రతినిధుల జోక్యం ఉంటోందంటూ అక్కడక్కడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి వాటిలో జోక్యం వద్దంటూ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే పలుసార్లు నేతలను హెచ్చరించారు. తాజాగా మంగళగిరి పార్టీ ఆఫీసులో టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జరిగిన భేటీలోనూ చంద్రబాబు నాయుడు ఇదే విషయాన్ని ప్రస్తావించారు. అయితే కొంతమందికి మాత్రం ఈ విషయంలో చంద్రబాబు మినహాయింపు ఇచ్చినట్లు తెలిసింది. నేతలను ఉద్దేశించి మాట్లాడిన చంద్రబాబు నాయుడు.. వారసత్వంగా మద్యం వ్యాపారం చేసుకునేవారు పర్లేదు కానీ.. కొత్తగా ఈ వ్యాపారం ప్రారంభించాలని మాత్రం అనుకోవద్దని సూచించారు. దీనివలన పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని చంద్రబాబు చెప్పారు.


 "కొత్తగా మద్యం, ఇసుక పాలసీలు తీసుకువచ్చాం. మీ అందరినీ నేను ఒకటే కోరుతున్నా. ప్రజలు మనల్ని్ అనుమానించే పరిస్థితి వస్తే పార్టీ ఇమేజీకి, మనకు ఇబ్బందులు వస్తాయి. ఉదాహరణకు మాగుంట కుటుంబం. వారు వారసత్వంగా లిక్కర్ వ్యాపారంలో ఉన్నారు. అలాంటి వారు ఓకే. ముందు నుంచి లిక్కర్ వ్యాపారం చేసుకునేవారు పర్లేదు. అలా కాకుండా కొత్తగా ఈ వ్యాపారంలోకి రావాలనుకుంటే మాత్రం పార్టీ ప్రతిష్ట పోతుంది. ఆ విషయంలో నేను చాలా స్పష్టంగా ఉన్నా. ఇప్పటికే ఒకట్రెండు సార్లు చెప్పాను. ఈ విషయంలో చాలా క్రమశిక్షణతో ఉండాలి. మొన్నటి ఎన్నికల్లో చూశారు. అవతలి వాళ్లు బస్తాలు బస్తాలు డబ్బులు ఖర్చుపెట్టారు. ఓట్లేశారా? ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ లేకపోతే, మనమీద నమ్మకం లేకపోతే డబ్బులతో ఏ ఎన్నికలూ జరగవు. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి" అంటూ సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.


నాయకుడికి విశ్వసనీయత రావాలంటే ఎంతో సమయం పడుతుందన్న చంద్రబాబు.. అదే విశ్వసనీయత పోవడానికి నిమిషం చాలని అభిప్రాయపడ్డారు. తనతో సహా ఎవరికైనా ఇదే ఫార్ములా వర్తిస్తుందని చెప్పారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వ నిర్వాకంతో వారసత్వంగా అనేక సమస్యలు వచ్చాయన్న చంద్రబాబు.. రోడ్లపై గుంతలు పూడ్చటానికే రూ.700 కోట్లు అవుతుందని అన్నారు. తప్పు చేసిన వారిని ఎవర్నీ వదిలిపెట్టమన్న చంద్రబాబు.. అలాగని కక్ష సాధింపు చర్యలకు దిగితే వైసీపీకి మనకి తేడా లేదని ప్రజలు అనుకుంటారని అన్నారు. తప్పు చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తామని.. వదిలేది ఉండదని స్పష్టం చేశారు. ఇక చిన్న ఉద్యోగి తప్పు చేసినా ఆ ప్రభావం సీఎంపై పడుతుందని.. అలాగే ఎన్డీఏలో ఉన్న ఏ కార్యకర్త తప్పు చేసినా సీఎంతో పాటు ప్రభుత్వంపై కూడా ఆ ప్రభావం ఉంటుందన్నారు. మన ప్రవర్తన పార్టీకి నష్టం జరగకుండా చూసుకోవాలని నేతలకు సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com