ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్ కెనడా మధ్య భగ్గుమన్న విభేదాలు.. హై కమిషనర్‌ను వెనక్కి పిలిచిన కేంద్రం

national |  Suryaa Desk  | Published : Mon, Oct 14, 2024, 09:50 PM

భారత్-కెనడా దౌత్య సంబంధాలు తీవ్ర పతనానికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే కెనడాలో ఉంటున్న భారత దౌత్యవేత్తల భద్రతకు సంబంధించి ఆ దేశంలో అధికారంలో ఉన్న జస్టిన్ ట్రూడో ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని భారత్ తేల్చి చెప్పింది. ఇందులో భాగంగానే కెనడాలో ఉంటున్న భారత హై కమిషనర్, ఇతర దౌత్యవేత్తలను వెనక్కి పిలుస్తున్నట్లు తెలిపింది. అయితే భారత్ ఇంతటి తీవ్ర నిర్ణయం తీసుకోవడం వెనుక పెద్ద కథే ఉంది. ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసు దర్యాప్తులో భాగంగా కెనడాలో భారత హై కమిషనర్‌గా ఉన్న సంజయ్ కుమార్ వర్మ సహా పలువురు దౌత్యవేత్తల పేర్లను అనుమానితుల జాబితాలో సోమవారం జస్టిన్ ట్రూడో సర్కార్ చేర్చింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన విదేశాంగ శాఖ.. కెనడా ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.


భారత్‌, కెనడాల మధ్య దౌత్య సంబంధాల విషయంలో సోమవారం కీలక పరిణామాలు జరిగాయి. నిజ్జర్‌ హత్యకేసులో భారత అధికారులను అనుమానితులుగా పేర్కొనడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన భారత్.. అక్కడ భారత దౌత్యవేత్తలకు భద్రత కల్పించే విషయంలో జస్టిన్ ట్రూడో ప్రభుత్వంపై విశ్వాసం లేదని భారత విదేశాంగశాఖ స్పష్టం చేసింది. ఇక ఇదే విషయంపై భారత్‌లో ఉంటున్న కెనడా దౌత్యవేత్త స్టీవర్ట్‌ వీలర్‌కు భారత విదేశాంగ శాఖ సమన్లు కూడా జారీ చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండానే భారత హై కమిషనర్, ఇతర దౌత్యవేత్తలను అనుమానితుల జాబితాలో చేర్చడం ఏంటని కెనడా దౌత్యాధికారికి స్పష్టం చేసింది.


కెనడా గడ్డపై భారత వ్యతిరేక కార్యకలాపాలకు జస్టిన్ ట్రూడో ప్రభుత్వం మద్దతు తెలుపుతోందని ఆరోపించిన భారత్.. మత ఛాందసవాదులకు మద్దతు పలుకుతున్నారని.. ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని మండిపడింది. కెనడా ప్రభుత్వం తీసుకున్న చర్యలకు ప్రతిస్పందనగా తగిన చర్యలు తీసుకునే హక్కు తమకు ఉందని స్పష్టం చేసింది. ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్‌ హత్య కేసులో భారత హైకమిషనర్‌ సంజయ్‌ కుమార్‌ వర్మ పేరును అనుమానితుల జాబితాలో చేర్చడంతో ఈ సరికొత్త వివాదం తలెత్తింది.


1988 బ్యాచ్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారి అయిన సంజయ్ కుమార్ వర్మ.. వివిధ దేశాల్లో దౌత్యవేత్తగా పనిచేశారు. చైనా, ఇటలీ, హాంకాంగ్‌, వియత్నాం, తుర్కియే వంటి దేశాల్లో దౌత్య సేవలు అందించారు. ఇక రిపబ్లిక్‌ ఆఫ్ సుడాన్‌లో భారత అంబాసిడర్‌గా ఉన్నారు. ఆ తర్వాత భారత విదేశాంగ శాఖలో సంయుక్త కార్యదర్శిగా, అదనపు కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. జపాన్‌, మార్షల్‌ ఐలాండ్స్‌లోనూ విధులు నిర్వహించారు. 2022 సెప్టెంబర్‌లో కెనడాలో భారత హైకమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com