ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీకి కేంద్రం డబుల్ ధమాకా.. కేంద్రం నిర్ణయంతో రాష్ట్రానికి మహర్దశ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 14, 2024, 09:47 PM

ఏపీకి కేంద్రం నుంచి డబుల్ ధమాకా.. మరో శుభవార్త అందింది. రాష్ట్రంలో స్థానిక సంస్థలకు భారీగా నిధులు విడుదలయ్యాయి. ఏపీ గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.988.773 కోట్లు విడుదల చేయగా.. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ ఈ నిధుల్ని ఇచ్చారు. వీటిలో అన్‌టైడ్‌ గ్రాంట్స్‌ కింద రూ.395.5091 కోట్లు ఇవ్వగా.. టైడ్‌గ్రాంట్స్‌ కింద రూ.593.2639 కోట్లు విడుదల చేశారు. ఈ మొత్తం 9 జడ్పీలు, 615 మండల పంచాయతీలు, రూ.12,853 గ్రామపంచాయతీలకు దక్కుతాయి.


రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్‌లో పొందుపరిచిన 29 అంశాల ఆధారంగా.. అన్‌టైడ్‌ గ్రాంట్స్ స్థానిక అవసరాలు పరిష్కరించుకోవడానికి ఉపయోగించాల్సి ఉంటుంది. వ్యవసాయం, గ్రామీణగృహనిర్మాణం, పారిశుద్ధ్యం, విద్య వంటి పనుల కోసం ఈ నిధులు వెచ్చించవచ్చు. ఈ నిధుల్ని జీతాలు, పరిపాలన ఖర్చుల కోసం ఉపయోగించకూడదు. అలాగే టైడ్‌గ్రాంట్స్‌ని నీటి యాజమాన్యం, వాననీటి సంరక్షణ, ఓడీఎఫ్, పారిశుద్ధ్యం, మురికినీటి రీసైక్లింగ్, ఇళ్ల నుంచి వెలువడిన వ్యర్థాల శుద్ధికి ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ నిధులు ప్రధానంగా గ్రామీణ స్థానిక సంస్థల అత్యవసర సౌకర్యాలు, మౌలిక వసతులను కల్పించుకోవడానికి పంచాయతీలకు ఉపయోగపడతాయని కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ తెలిపింది.


మరోవైపు ఏపీలో గ్రామాల అభివృద్ధికి నేటి నుంచి కీలక ముందడుగు పడనుంది. రాష్ట్రవ్యాప్తంగా ‘పల్లెపండగ’ వారోత్సవాల్లో భాగంగా రూ.4,500 కోట్లతో చేపట్టే 30 వేల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభంకానున్నాయి. కృష్ణా జిల్లా కంకిపాడులో నిర్వహించే కార్యక్రమంలో డిప్యూటీ సీఎం, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పవన్‌ కళ్యాణ్ పాల్గొంటారు. కంకిపాడులోని ప్రభుత్వ ఆసుపత్రి పక్కన మైదానంలో జరిగే ఈ కార్యక్రమంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు.


రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఈ పల్లె పండగ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు..ఈ నెల 20 వరకు ఈ వారోత్సవాల్లో 30 వేల పనులకు శంకుస్థాపనలు చేయించి, సంక్రాంతి లోగా పనులు పూర్తి చేయించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గత ఆగస్టు 23న 13,326 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఉపాధిహామీ పథకంలోని మెటీరియల్‌ నిధులతో గ్రామాల్లో చేపట్టబోయే అభివృద్ధి పనులపై తీర్మానాలు చేశారు. మొత్తం 3 వేల కిలోమీటర్ల సిమెంట్‌ రోడ్లు, మరో 500 కిలోమీటర్ల తారు రోడ్లు, 25 వేల గోకులాలు, 10 వేల వాన నీటి సంరక్షణ కందకాలకు పల్లెపండగ వారోత్సవాల్లో శంకుస్థాపనలు చేస్తారు.


రాష్ట్రంలో రోడ్ల నిర్మాణానికి సంబంధించి సిమెంట్‌ కొనుగోలుకు సంబంధించి ఒక్కో బస్తా రూ.270 చొప్పున స్థానిక మార్కెట్లలో కొనుగోలు చేసి వాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రోడ్డు నిర్మాణానికి అవసరమైన ఇసుకను ప్రభుత్వం ఆమోదించిన క్వారీల నుంచి సేకరించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com