ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముంబై నటి కేసులో మరో బిగ్ ట్విస్ట్.. చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 14, 2024, 09:02 PM

ఏపీలో సంచలనంగా మారిన ముంబై నటిపై వేధింపుల కేసు మరో మలుపు తిరిగింది. చంద్రబాబు సర్కార్ ఈ కేసు దర్యాప్తు బాధ్యతల్ని సీఐడీకి అప్పగించింది.. ఈ మేరకు డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు ఈ కేసును విజయవాడ పోలీసులు దర్యాప్తు చేయగా.. ఈ కేసు వెనుక సూత్రధారుల ఎవరో తేల్చేందుకు మరింత లోతైన దర్యాప్తు అవసరమని భావించిన ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి అప్పగించింది. ఈ మరకు అన్ని ఫైల్స్ సీఐడీకి అప్పగించాలని డీజీపీ ఆదేశించారు.


గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ముంబై నటిపై కేసులు, వేధింపుల వ్యవహారం కలకలంరేపింది. ఆమెపై విజయవాడలో కేసు నమోదు చేయగా.. వైఎస్సార్‌సీపీ నేత కుక్కల విద్యాసాగర్, ఐపీఎస్ అధికారులు ముగ్గురిపై ఆరోపణలు వచ్చాయి. విద్యాసాగర్‌ ఫిర్యాదుతో ముంబై నటిపై ఇబ్రహీంపట్నం స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఆమె తల్లిదండ్రులు, సోదరుడిపైనా ఈ ఏడాది ఫిబ్రవరి 2న ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేశారు. ఆ మరుసటి రోజు (ఫిబ్రవరి 3)న ముంబై వెళ్లి నటితో పాటూ తల్లిదండ్రుల్ని అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకొచ్చారు. ఆమె పెట్టిన కేసు విషయాన్ని పోలీసులు రహస్యంగా ఉంచారనే విమర్శలు వచ్చాయి.


ముంబై నటిపై వేధింపుల వ్యవహారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆగస్టు 26న బయటపడింది. ఆమె విజయవాడ సీపీపీని కలిసి ఫిర్యాదు చేయగా.. ఏసీపీ స్రవంతిరాయ్ విచారణ అధికారిణిగా ఉన్నారు. అయితే ప్రభుత్వం ఈ కేసు వ్యవహారంలో.. దర్యాప్తు ఆధారంగా ఐపీఎస్‌లు సీతారామాంజనేయులు, కాంతిరాణా, విశాల్‌గున్నీ, ఏసీపీ హనుమంతరావు, సీఐ సత్యనారాయణలను సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. అలాగే ముంబై నటి ఫిర్యాదు ఆధారంగా గతనెల 14న ఇబ్రహీంపట్నం స్టేషన్‌లో వైఎస్సార్‌సీపీ నేత విద్యాసాగర్, ఐపీఎస్‌ అధికారులపై కేసు నమోదు చేశారు.ఈ రెండు కేసులనూ సీఐడీకి బదిలీ చేసింది ప్రభుత్వం.


మరోవైపు 2023 ఫిబ్రవరి 20న గన్నవరం టీడీపీ కార్యాయంపై దాడి కేసును కూడా ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఈ ఘటనలో టీడీపీ కార్యాయంపై మూకుమ్మడి దాడి చేయగా పలువురు నేతలు, కార్యకర్తలు, పోలీసులకు గాయాలు అయ్యాయి. ఓ కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించి.. మరో మూడు కార్లను ధ్వసంం చేశారు. ఈ కేసు అప్పట్లో సంచలనంగా మారింది.. ఈ వ్యవహారంలో టీడీపీ నేతలపై కేసులు పెట్టారనే విమర్శలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జులై నుంచి ఈ కేసు దర్యాప్తు ప్రారంభమైంది. వల్లభనేని వంశీతో పాటూ మరో 71మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసును కూడా సీఐడీకి అప్పగించారు. అంతేకాదు మంగళగిరిలోని తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై, ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటిపై జరిగిన దాడి కేసుల్ని కూడా సీఐడీకి అప్పగించింది ప్రభుత్వం.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com