అర్ధరాత్రి 12.45 గంటలు.. డిర్ర్ర్ర్ర్ర్ గోపరాక్ (బహుపరాక్) అంటూ వేలాదిగా భక్తగణం దేవరగట్టుపైకి చేరుకుంది. తలకు పాగచుట్టి.. చేతిలో కర్రపట్టి యుద్దానికి సిద్ధమైన సైనికుల్లా దేవుడి కార్యంలో నిమగ్నమయ్యారు. శుభముహూర్తం అర్ధరాత్రి ఒంటి గంటకు వేదపండితులు రవి శర్మ మాళ మల్లేశ్వరస్వాముల కల్యాణోత్సవం నిర్వహించారు.
జైత్రయాత్రకు సై అంటూ ఉత్సవమూర్తులతో కొండ దిగి సింహాసన కట్టవద్దకు చేరుకోగా.. దేవుడి దక్కించుకోవడానికి అప్పటికే అక్కడికి చేరుకున్న పలు గ్రామాల భక్తులు కర్రలతో మేము సైతం అంటూ కదనరంగంలోకి దిగడంతో.. బన్ని ఉత్సవం (కర్రల సమరం) మొదలైంది. 800 అడుగుల పైభాగాన ఉన్న దేవరగట్టుపై దాదాపు అరగంట పాటు బన్ని ఉత్సవం జరిగింది. ఆలూరు నియోజకవర్గం హోళగుంద మండలం దేవరగట్టు వేదికగా శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు జరిగిన ఉత్సవాన్ని కళ్లార వీక్షించాలని రాష్ట్ర నలమూలల నుంచే కాకుండా కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు.