ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయవాడ దుర్గమ్మకు భారీగా ఆదాయం.. ఒక్కరోజులోనే కళ్లు చెదిరే ఆదాయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 14, 2024, 07:10 PM

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ముగిశాయి. అయితే శుక్రవారం కనకదుర్గమ్మ దేవస్థానానికి భారీగా ఆదాయం వచ్చింది.. ఏకంగా రూ.84,02,775 ఆదాయం సమకూరింది. ఆ రోజు 4,149 మంది భక్తులు రూ.500 టికెట్లు కొనుగోలు చేయగా రూ.20,74,500 ఆదాయం వచ్చింది. అలాగే 1,847 మంది రూ.300 టికెట్లు కొనుగోలు చేయగా రూ.5,54, 100.. రూ.100 టికెట్‌తో 4,686 మంది దర్శించుకోగా రూ.46, 86,000 ఆదాయం సమకూరినట్లు తెలిపారు. అలాగే 26,584 లడ్డూలను విక్రయించగా.. రూ.3,98,760, రూ.100 చొప్పున ఆరు లడ్డూలున్న ప్యాకింగ్‌ లను విక్రయించగా రూ.44,06,600 ఆదాయం సమకూరింది. అయితే ఆలయంలో మొత్తం 2,64,396 లడ్డూలను విక్రయించారు.


పరోక్ష ప్రత్యేక కుంకు మార్చన రూ.3000 టికెట్లను 18 మంది కొనుగోలు చేశారు.. రూ.54వేలు వచ్చాయి. పరోక్ష ప్రత్యేక చండీహోమానికి రూ.4వేల టికెట్లను ఏడుగురు కొనుగోలు చేయగా రూ.28వేలు.. దీంతో పాటూ శ్రీచక్ర నవావరణార్చన కోసం రూ.3,000 టికెట్‌ను ఇద్దరు కొనుగోలు చేయగా రూ.6వేలు ఆదాయం సమకూరింది. పబ్లికేషన్లు, ఫొటోలు, క్యాలెండర్ల ద్వారా రూ.10,230.. మిగిలిన ఆదాయం రూ.20, 545, రూ.40 టికెట్‌ ద్వారా 9,536 మంది తలనీలాలు సమర్పించగా రూ.3,81,440 ఆదాయం వచ్చింది.


మరోవైపు నెల్లూరుకు చెందిన వ్యాపారవేత్త పంకజ్‌రెడ్డి, సరిత దంపతులు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మకు రూ.10 లక్షల విలువైన బంగారు హారాన్ని కానుకగా అందజేశారు. ఈవో రామారావును ద్వారా హారాన్ని దేవస్థానానికి అప్పగించారు. దాతలకు ఆలయ పండితులు ఆశీర్వచనాలు అందించగా.. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖ దుర్గమ్మను దర్శించుకున్నారు. అలాగే నటుడు 30 ఇయర్ ఇండస్ట్రీ పృధ్వీ కూడా అమ్మవారి సేవలో పాల్గొన్నారు.


విజయవాడ దుర్గమ్మ శ్రీరాజరాజేశ్వరీదేవి రూపంలో విజయదశమి రోజున శనివారం భక్తులకు దర్శనమిచ్చారు. శనివారం నుంచి భవానీ భక్తుల రద్దీ పెరిగింది. . ఉదయం నుంచి రాత్రి 11 గంటల వరకూ లక్ష మందికిపైగా భక్తులు దర్శనానికి వచ్చారు. సాయంత్రం వేళ కృష్ణా నదిలో తెప్పోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com