ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సినిమాలా.. రాజకీయాలా.. ఏది ముఖ్యమో చెప్పేసిన పవన్ కళ్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 14, 2024, 06:50 PM

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫ్యాన్స్ అందు పవర్ స్టార్ ఫ్యాన్స్ వేరయా అనే లెవల్లో వారి అభిమానం ఉంటుంది. ఇక సినిమాల్లో పవర్ స్టార్‌గా ఉన్న పవన్ కళ్యాణ్.. పాలిటిక్స్‌లోనూ పవర్‌లోకి వచ్చారు. డిప్యూటీ సీఎం హోదాతో పాటుగా కీలకమైన మంత్రిత్వశాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ నుంచి సినిమా మళ్లీ ఎప్పుడొస్తుందా అని.. ఆయన సినిమాల అప్ డేట్ ఏంటా అని ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమాల గురించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సోమవారం పల్లె పండుగ కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో భాగంగానే కృష్ణా జిల్లా కంకిపాడులో పల్లె పండుగ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌ను చూసిన ఫ్యాన్స్ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఆయన నెక్ట్స్ మూవీ అయిన ఓజీని గుర్తుచేస్తూ.. ఓజీ, ఓజీ అంటూ నినాదాలు చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ సినిమాల అంశాన్ని ప్రస్తావించాల్సి వచ్చింది. అభిమానులు ఓజీ.. ఓజీ.. అంటూ ఉంటే చాలారోజులు అది తనకు మోదీ, మోదీ అని వినిపించిందని పవన్ గుర్తు చేసుకున్నారు. అయితే సినిమాల కంటే ముందు బాధ్యత ముఖ్యమని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ముందు బాధ్యత.. ఆ తర్వాతే వినోదమంటూ పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.


" నేను అందరూ హీరోలు బాగుండాలని కోరుకుంటాను. ఎవరితోనూ పోటీ పడను. ప్రతీ ఒక్కరికీ వారిదంటూ ఒక శైలి ఉంది. నాకు చిరంజీవి గారన్నా, బాలకృష్ణ గారన్నా, ప్రభాస్, రామ్‌చరణ్, అల్లు అర్జున్, తారక్, మహేష్ బాబు ఇతర ప్రతీ హీరో అన్నా కూడా ఇష్టమే, వారి సినిమాలు విజయం సాధించాలని, మీరు అనందపడాలని కోరుకుంటా. కానీ మీరు సినిమాలు చూడాలంటే ముందు మీ దగ్గర సంపాదన ఉండాలి కదా, అది సృష్టించడం కోసం మేము పనిచేస్తాం. అభిమానుల కోరిక కూడా నాకు తెలుసు, నాకు ప్రజల సమస్యల పరిష్కారం ఎక్కువ ఆనందం ఇస్తుంది. మీ సమస్యల పరిష్కారంతో పాటుగా మీ ఆనందం కూడా ముఖ్యమే, నేను మరింత బలంగా పనిచేయాలన్నా, ఎవరికైనా సహాయం చేయాలన్నా ఆర్థికంగా నాకు సినిమాలు ఒక్కటే. తీరిక సమయంలో సినిమాలు చేసి మిమ్మల్ని ఆనందింపజేస్తా" అని పవన్ కళ్యాణ్ అన్నారు.


మరోవైపు ఈ సందర్భంగానే సీఎం చంద్రబాబుపైనా పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు. మన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు లాంటి అనుభవజ్ఞుడి అవసరం ఉందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి బలమన్న పవన్..ఆయన అనుభవాన్ని ఉపయోగించుకోకపోతే తప్పుచేసిన వాళ్లమవుతామన్నారు. గత వైసీపీ పాలనలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి అంటే ఎవరో కూడా తెలియదన్న పవన్ కళ్యాణ్.. ప్రభుత్వం పెట్టిన ఖర్చుకు లెక్కలు కూడా లేవన్నారు. కూటమి ప్రభుత్వం మాత్రం అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామసభలు నిర్వహించి, తీర్మానాలు చేసి.. వారి నిర్ణయాల మేరకే పనులు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా రూ.4 వేల 500 కోట్ల నిధులతో 30 వేలు పనులు చేస్తున్నట్లు కంకిపాడు సభలో పవన్ కళ్యాణ్ వివరించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com