ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్.. చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 14, 2024, 06:39 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా పరుగులు పెట్టించేందుకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా కృషిచేస్తున్నారు. ఓ వైపు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూనే.. మరోవైపు అభివృద్ధిని పరుగులు పెట్టించాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు, పారిశ్రామిక అభివృద్ధి, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ డ్రాఫ్ట్ పాలసీపై సోమవారం సచివాలయంలో సంబంధిత శాఖల మంత్రులు, అధికారులతో చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన పారిశ్రామిక పాలసీని తీసుకువచ్చే అంశంపై చర్చించారు. ఈ క్రమంలోనే అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.


ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి కోసం రాజధాని అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పేరుతో ప్రత్యేక హబ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇన్నోవేషన్, స్టార్టప్స్ ఫెసిలిటేషన్, స్కిల్ డెవలప్‌మెంట్ ప్రధానంగా ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు కానుంది. ఈ హబ్‌కు అనుబంధంగా రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల్లో కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఒక్కో కేంద్రానికి ఒక్కో మల్టీనేషనల్ కంపెనీ మెంటార్‌గా వ్యవహరించనుంది. ఈ రకంగా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటితో పాటుగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ఆహారశుద్ధి రంగాలలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా వ్యాపారవేత్తలకు ఐదు శాతం అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చే విషయంలోనూ చంద్రబాబు చర్చలు జరిపారు. అలాగే ఎక్కువ ఉద్యోగాలు కల్పించే సంస్థలకు పదిశాతం ఇన్సెంటివ్స్ ఇచ్చే విషయాన్ని పరిశీలించారు. ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్కులపైనా చర్చ జరిగింది.


మరోవైపు ఉద్యోగ కల్పనే ప్రభుత్వం మొదటి ప్రాధాన్యమని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఏడెనిమిది శాఖల్లో నూతన పాలసీలు తీసుకురానున్నట్లు చెప్పారు. ఒక కుటుంబం.. ఒక పారిశ్రామిక వేత్త అనే కాన్సెప్ట్‌తో ఎంఎస్‌ఎంఈ పాలసీ ఉండాలని స్పష్టం చేశారు. పెట్టుబడిదారులను ఆకర్షించేలా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తెచ్చేలా కొత్త పాలసీలు ఉంటాయని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అత్యుత్తమంగా ఉండేలా ఏపీ పారిశ్రామిక విధానం ఉండాలని అధికారులకు సూచించారు.వచ్చే మంత్రివర్గ సమావేశం ముందుకు పారిశ్రామిక అభివృద్ధి పాలసీ, ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ తేవాలని నిర్ణయించారు. అలాగే ఇండస్ట్రియల్ పార్క్ పాలసీపై మరింత కసరత్తు చేయాలని నిర్ణయించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com