ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ప్రభుత్వం సూపర్ ప్లాన్.. డ్వాక్రా సంఘాల మహిళలకు అద్భుత స్కీమ్..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 06, 2024, 06:32 PM

ఏపీలోని మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే మరో గుడ్ న్యూస్ వినిపించనుంది. డ్వాక్రా సంఘాల్లో ఉండే మహిళలకు లాభాన్ని చేకూర్చేలా ఓ కొత్త పథకాన్ని అమలు చేసే ఆలోచన చేస్తోంది. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభిస్తామని టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పటికే మహిళలకు సూపర్ న్యూస్ చెప్పింది. ఇక త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆడబిడ్డ నిధి వంటి పథకాలను సైతం అమలు చేసేందుకు ప్రయత్నాలు మొదలెట్టింది. అయితే వీటికంటే ముందే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఓ పథకాన్ని రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాలకు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తోంది ప్రభుత్వం. వీటికి తోడుగా కేంద్ర ప్రభుత్వ పథకమైన స్ఫూర్తి పథకాన్ని రాష్ట్రంలోని మహిళలకు అమలు చేయాలని ప్లాన్ చేస్తోంది.


రైతులు, చేతివృత్తిదారులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ స్ఫూర్తి పథకం తీసుకు వచ్చింది. స్ఫూర్తి  అంటే స్కీమ్ ఆఫ్ ఫండ్ ఫర్ రీజనరేషన్ ఆఫ్ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్. 2005 చివర్లో కేంద్రం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను క్లస్టర్ల వారీగా అభివృద్ధి చేసేందుకు 2022లో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మరింత విస్తృతపరిచింది. ఖాదీ పరిశ్రమ, కుటీర పరిశ్రమ, ఔషధ మొక్కల పరిశ్రమ, తేనెటీగల పెంపకం, వ్యవసాయ ఆధారిత, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, పాలిమర్లు, రసాయన ఆధారిత పరిశ్రమలు , ఫైబర్ పరిశ్రమ, వస్త్ర పరిశ్రమల అభివృద్ధికి ఈ పథకం తోడ్పాటు అందిస్తుంది. చేతివృత్తుల వారి ఆదాయం పెంచే లక్ష్యంతో మౌలిక వసతుల కల్పన, టెక్నాలజీ అప్‌గ్రెడేషన్, ట్రైనింగ్, డిజైన్లు, మార్కెటబులిటీ, ప్యాకేజింగ్ వంటి విషయాల్లో తోడ్పాటు అందిస్తుంది.


స్ఫూర్తి పథకం కింద 500 లేదా అంతకంటే తక్కువ మంది చేతివృత్తుల వారు ఉన్న క్లస్టర్ల అభివృద్ధికి రూ.2.5 కోట్లు.. 500 కంటే ఎక్కువ మంది ఉన్న ప్రధాన క్లస్టర్ల అభివృద్ధికి రూ.5 కోట్ల వరకూ కేంద్రం సహాయం అందిస్తుంది.


అయితే ఈ పథకాన్ని డ్వాక్రా మహిళల కేంద్రంగా అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా తొలుత జిల్లాలలో క్లస్టర్లు ఏర్పాటు చేస్తారు. ఒక్కో క్లస్టర్‌లో వివిధ రకాల జీవనోపాధుల్లో ఉన్న డ్వాక్రా మహిళలు 1000 నుంచి 1500 ఉంటారు. ఆంధ్రప్రదేశ్‌లో 26 జిల్లాలు ఉంటే ఒక్కో జిల్లాకు ఒక్కో ప్రాజెక్టును గుర్తించారు. అయితే తొలి విడతలో ఈ ఏడాది 11 జిల్లాలలో మాత్రమే క్లస్టర్లు ఏర్పాటు చేస్తారు. ఒక్కో ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రూ.5 కోట్లు ఇస్తుంది. ఇందులో 90 శాతం కేంద్రం గ్రాంట్ కాగా.. పదిశాతాన్ని లబ్ధిదారులు పెట్టుకోవాల్సి ఉంటుంది. లేదా రాష్ట్ర ప్రభుత్వమైనా చెల్లించే అవకాశం ఉంది.


ఇక ఈ ప్రాజెక్టులో భాగంగా కామన్‌ ఫెసిలిటీ సెంటర్‌ను అధికారులు ఏర్పాటు చేస్తారు. అలాగే ప్రాసెసింగ్‌ యూనిట్లు, సరకులు, పంట ఉత్పత్తుల నిల్వకు గోదాములు ఏర్పాటు చేస్తారు. క్లస్టర్లలోని మహిళలు ఎప్పటికప్పుడు ఉత్పత్తులను సేకరించి, అమ్మకాలు జరపాల్సి ఉంటుంది. దీని ద్వారా వచ్చిన ఆదాయాన్ని అందరూ పంచుకుంటారు. ఇక దీనికి హైదరాబాద్‌లోని జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ సంస్థ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com