ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రస్తుత రాజకీయాల్లో లేకపోవడం నా అదృష్టం: దగ్గుబాటి వెంకటేశ్వరరావు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 05, 2024, 09:23 PM

తాను చాలా అదృష్టవంతుడిని అంటున్నారు మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ప్రస్తుత రాజకీయాలను వదిలేసి చాలా మంచిపని చేశానన్నారు. ప్రస్తుత రాజకీయాలు ఖరీదు అయ్యాయని.. ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులు భారీగా ఖర్చు పెట్టాలని, గెలిచిన తర్వాత కూడా డబ్బులు ఖర్చు చేయాల్సి పరిస్థితులు ఉన్నాయన్నారు. గతంలో ఇలాంటి పరిస్థితులు లేవని.. ప్రస్తుత రాజకీయాలు వేరన్నారు. బాపట్ల జిల్లా కారంచేడులో జరిగిన వాటర్‌ప్లాంట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్‌, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో కలసి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ప్రస్తుత రాజకీయాలు డబ్బుతో ముడిపడి ఉన్నాయని.. కోట్లు ఖర్చుపెట్టి గెలిచిన తర్వాత కూడా ప్రజల నుంచి తిట్లు తప్పటం లేదన్నారు.


చీరాల ఎమ్మెల్యే కొండయ్య చీరాల ఓడరేవులో ప్రమాదాలు జరగకుండా ఇటీవల గజ ఈతగాళ్లను ఏర్పాటు చేసి వారికి జీతాలు చెల్లించే విధంగా రిసాట్స్‌ వాళ్లతో మాట్లాడారని గుర్తు చేశారు వెంకటేశ్వరరావు. అయితే ఎమ్మెల్యే కొండయ్య డబ్బులు వసూలు చేస్తున్నారని రిపోర్టర్లు వార్తలు రాశారని చెప్పుకొచ్చారు. అలాగే వరద బాధితులకు సాయం కోసం ఓ కమ్యూనిటీ నుంచి విరాళాలు సేకరించిన సమయంలో కూడా ఆయనపై ఇలాంటి ఆరోపణలు చేశారన్నారు. డబ్బులు ఖర్చుపెట్టి రాజకీయంలోకి వచ్చి.. ప్రజలకు సేవ చేద్దామన్నా ఇలాంటి ఆరోపణలు తప్పట్లేదని వ్యాఖ్యానించారు. ఇవన్నీ చూసిన తర్వాత తాను అదృష్టవంతుడినని.. రాజకీయ జంజాటం నుంచి బయటపడ్డానన్నారు దగ్గుబాటి. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి కంటే ఓడిపోయినవాడు, సీటు దక్కనివాడు అదృష్టవంతుడు అన్నారు.


ఎన్నికల్లో పోటీ చేయనందుకు తనకు ఏ మాత్రం బాధ లేదన్నారు దగ్గుబాటి. రాజకీయాల నుంచి తృప్తిగా రిటైర్ అయ్యాననే భావన ఉందని.. లేదంటే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కనీసం రూ.20 కోట్లు కావాలని వ్యాఖ్యానించారు. ఒకవేళ గెలిస్తే మరో రూ.30 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇదే తన చివరి ప్రసంగం కావొచ్చని.. తాను వేదికలపై మాట్లాడడం లేదని, మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ కోసం మాట్లాడుతున్నాను అన్నారు వెంకటేశ్వరరావు. గతంలో ఉద్యోగాలు సులభంగా వచ్చేవని.. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేదన్నారు వెంకటేశ్వరరావు. చాలా కష్టమైన పరిస్థితి ఉందని.. 1985లో ఉద్యోగాలు ఈజీగా వచ్చేవన్నారు.


మాజీమంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఎంపీ పురందేశ్వరిల కుమారుడు హితేశ్‌ చెంచురామ్‌ పెద్ద మనసు చాటుకున్నారు. సొంత గ్రామం బాపట్ల జిల్లా కారంచేడు ప్రజలకు స్వచ్ఛ జలాలను అందించాలనే సంకల్పంతో రూ.కోటి విరాళం ఇచ్చారు. కారంచేడులో నిర్వహించిన సభలో రాష్ట్రమంత్రి గొట్టిపాటి రవికుమార్, కలెక్టర్‌ వెంకట మురళి, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావులకు తన తల్లిదండ్రుల సమక్షంలో చెక్కును హితేశ్‌ ఇచ్చారు. ఈ నిధులతో రోజుకు లక్షన్నర లీటర్ల నీటిని శుద్ధిచేసే సామర్థ్యం కలిగిన మరో నీళ్ల పథకాన్ని ఏర్పాటుచేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com