ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అరటిలో ఈ రకానికి భారీగా డిమాండ్.. ఆ జిల్లా రైతుల పంట పండింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 05, 2024, 09:18 PM

ఉమ్మడి అనంతపురం జిల్లా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దశాబ్దాలుగా కరవు.. రైతుల ఆత్మహత్యలతో ఎప్పుడూ వార్తల్లో నానుతూ ఉండే జిల్లా. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయి. అనంతపురం రైతన్న కూడా అవకాశాలను అందిపుచ్చుకునే పనిలో పడ్డాడు. పండ్ల తోటలు, కూరగాయల సాగుపై అనంతపురం జిల్లా రైతులు ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లా ప్రీమియం వెరైటీ అరటి పండ్లు ఎగుమతులకు కేంద్రంగా నిలుస్తోంది. గ్రాండ్ నైన్ అనే ప్రీమియం రకం అరటి ఎగుమతులకు అనంతపురం హబ్‌గా నిలుస్తోంది. ఈ రకం అరటికి మార్కెట్లో భారీగా డిమాండ్ ఉంది.


అనంతపురం జిల్లాలోని బెలుగుప్ప, నార్పల, పుట్లూరు, యల్లనూరు, తాడిమర్రి, యాడికి, పెదపప్పూరు మండలాల్లో ఈ రకం అరటిని రైతులు ఎక్కువగా సాగుచేస్తుంటారు. అలాగే పులివెందులలోనూ సాగు చేస్తున్నారు. అయితే అనంతపురంలోని ఈ మండలాల్లో 20 వేల హెక్టార్లలో సుమారుగా 8 లక్షల టన్నుల అరటి సాగుచేస్తున్నారు. మొత్తంగా హెక్టారుకు 50 టన్నుల అరటి పండ్లు పండిస్తున్నారు. 2019లో రూ.18 కోట్లు విలువైన 12 వేల టన్నులు అరటి పండ్లు ఎగుమతి చేశారు. అప్పటి నుంచి ఎగుమతులు పెరుగుతూనే ఉన్నాయి.


ఇక 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.140 కోట్లు విలువైన అరటి పండ్లు ఎగుమతి చేసినట్లు అధికారులు చెప్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరికి అరటి ఎగుమతులు రూ. 300 కోట్లకు చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం గ్రాండ్ నైన్ అరటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని అధికారులు చెప్తున్నారు. ఈ రకం అరటిపండ్లు టన్ను రూ.22 వేల వరకూ పలుకుతోందని చెప్తున్నారు. ఇజ్రాయెల్ - అరబ్ దేశాల యుద్ధం కారణంగా మిడిల్ ఈస్ట్‌ దేశాలకు అరటి ఎగుమతులకు ఆటంకం కలుగుతోందన్న అధికారులు.. రష్యాకు అరటి ఎగుమతులు పెరుగుతున్నాయని చెప్పారు. అలాగే మల్టీ నేషనల్ సంస్థలు రైతులతో నేరుగా అరటి పండ్ల కోసం ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయని.. దీనితో రైతులకు మంచి ధర లభిస్తోందని జిల్లా అధికారులు చెప్తున్నారు.


అరటి పండ్లు సాగు లాభదాయకంగా ఉండటంతో ఈ ప్రాంతాల్లో చాలా మంది రైతులు అరటి సాగుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని మల్టీ నేషనల్ సంస్థలు సైతం అరటి పళ్లు కోసం జిల్లాలోని అరటి రైతులను సంప్రదిస్తున్నాయి. వారితో ఒప్పందాలు చేసుకుని అరటి పండ్లు కొనుగోలు చేస్తున్నాయి. అనంతరం వీటికి క్లీనింగ్, గ్రేడింగ్, స్ప్రేయింగ్ తర్వాత పండ్ల నాణ్యతను పెంచి వినియోగదారులకు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే రైతులకు సైతం మంచి ధరలు లభిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com