ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో కొత్త వంటశాల.. 1.2 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 05, 2024, 06:51 PM

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీనివాసుడు కొలువైన తిరుమలకు నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ఆ శ్రీవారిని దర్శించుకుని తరిస్తూ ఉంటారు. శ్రీవారి దర్శనం తర్వాత వెంగమాంబ అన్నదాన సత్రంలో స్వామివారి అన్న ప్రసాదం స్వీకరించి.. శ్రీవారి కృపకు పాత్రులవుతూ ఉంటారు. ఇక శ్రీవారి భక్తుల కోసం టీటీడీ పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. వారికి ఎలాంటి ఇబ్బంది, అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే తిరుమలలో మరో వంటశాల అందుబాటులోకి వచ్చింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ కేంద్రీకృత వంటశాలను శనివారం ప్రారంభించారు. తిరుమలలోని పాంచజన్యం విశ్రాంతి భవనం వెనుక ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు పక్కన.. ఈ అధునాతన వంటశాలను ఏర్పాటు చేశారు. ఇక ఈ వంటశాలను రూ.13.45 కోట్ల వ్యయంతో నిర్మించారు.


మొత్తం 37,245 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆధునిక సౌకర్యాలతో ఈ వకుళామాత కేంద్రీకృత వంటశాలను ఏర్పాటు చేశారు. ఇక ఈ వంటశాల విషయానికి వస్తే 1.2 లక్షల మంది భక్తులకు ఆహారం సిద్ధం చేసేలా ఈ వంటశాలను ఏర్పాటు చేశారు. ఈ వంటశాలలో వంట, ఆహార ధాన్యాలు, కూరగాయలు. పాలు మొదలగు వాటిని గ్రౌండ్ ఫ్లోర్‌లో నిలువ ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక ఫస్ట్ ఫ్లోర్‌లో ఆహార తయారీ, ఎల్పీజీ ద్వారా నడిచే బాయిలర్లు, ఒక ఎగ్జాస్ట్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. వారాంతాలు, సెలవు రోజుల్లో తిరుమలకు భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో భక్తులు శ్రీవారి దర్శనానికి తరలివస్తుంటారు. అధిక రద్దీ సమయంలో భక్తులకు ఆహారం పంపిణీలో ఇబ్బందులు లేకుండా చూసేందుకు ఈ కేంద్రీకృత వంటశాలను ఏర్పాటు చేశారు.


ఈ కొత్త కేంద్రీకృత వంటశాల‌లో 1.20 లక్షల మంది భక్తులకు పులిహోర, సాంబార్ రైస్, పొగల్, ఉప్మా వంటి అన్నప్రసాదాలు సిద్ధం చేసి భక్తులకు అందించేలా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం సీఆర్‌వో వద్ద ఇప్పటికే కౌంటర్లు ఏర్పాట్లు చేశారు. ఈ కౌంటర్ల ద్వారా ఈ వంటశాలలో తయారుచేసిన అన్న ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేయనున్నారు. అలాగే సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్, పీఏసీ - I, రామ్ భగీచా విశ్రాంతి భవనం వద్ద వున్న బస్ స్టాండ్, ఔటర్ క్యూ లైన్ల వెంట ఫుడ్ కౌంటర్లలో పంపిణీ చేయనున్నారు. ఈ వంటశాలను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించగా.. దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి సహా ఇతర టీటీడీ అధికారులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com