ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈసారి పట్టాలపై ఏకంగా సిలిండర్.. నెలరోజుల్లో మూడో ఘటన

national |  Suryaa Desk  | Published : Sun, Sep 22, 2024, 10:08 PM

రైలు పట్టాలపై ఏదో ఒకటి అడ్డు ఉంచి.. రైళ్లు పట్టాలు తప్పేలే భారీ కుట్రకు తెరలేపే ఘటనలు ఇటీవల కాలంలో బాగా పెరిగిపోవడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లో రైలు పట్టాలపై గ్యాస్‌ సిలిండర్‌ను పెట్టగా.. దాన్ని ముందే గమనించిన లోకో పైలట్‌ రైలును ఆపడంతో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం కాన్పూర్‌లో జరిగిన ఈ ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ప్రేమ్‌పుర్‌ రైల్వే స్టేషన్‌ సమీపలో ఢిల్లీ-హౌరా రైలు వెళ్లే మార్గంలో పట్టాలపై గుర్తించారు. ఈ విషయాన్ని లోకో పైలట్.. రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌, రైల్వే పోలీసులకు చెప్పడంతో వారు అక్కడకి చేరుకుని పరిశీలించారు.


ఆదివారం తెల్లవారుజామున ఉదయం 5.50 గంటలకు పట్టాలపై సిలిండర్ ఉన్నట్లు లోకో పైలట్ గుర్తించే సమయానికి కాన్పూర్‌ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు వెళ్తున్న గూడ్స్‌ రైలు లూప్‌లైన్‌లో ప్రయాణిస్తోంది. ఆ మార్గంలో ఒక ఎక్స్‌ప్రెస్‌ రైలుకు దారి ఇచ్చే క్రమంలో ఆ గూడ్స్ రైలును ఆపిన సమయంలో అందులోని లోకో పైలట్‌ పట్టాలపై సిలిండర్‌ను గమనించి వెంటనే అధికారులకు సమాచారం అందించడంతో పెను ప్రమాదం తప్పింది. అది 5 లీటర్ల సామర్థ్యం ఉన్న గ్యాస్ సిలిండర్ అని గుర్తించిన రైల్వే సిబ్బంది దాన్ని తొలగించారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశాలు ఇచ్చినట్లు నార్త్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. రైళ్లను పట్టాలు తప్పించేలా వరుసగా జరుగుతున్న ఘటనలపై ప్రభుత్వం, అధికారులు సీరియస్ ఆదేశాలు ఇచ్చినా ఇలాంటివి ఆగకపోవడంతో రైల్వే ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత నెల రోజుల్లోనే ఇలాంటి ఘటనలు 3 జరగడం పెను సంచలనంగా మారింది.


రైళ్లు పట్టాలు తప్పేలా చేసి ప్రమాదాలకు గురిచేసేలా కుట్రలు ఇటీవల కాలంలో రోజురోజుకూ పెరుగుతున్నాయని కేంద్రం తెలిపింది. ఆగస్టు నెల నుంచి ఇలాంటివి 18 ఘటనలు జరిగినట్లు రైల్వేశాఖ ఇటీవల వెల్లడించింది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పట్టాలపై ఎల్‌పీజీ సిలిండర్లు, సైకిళ్లు, ఇనుప రాడ్లు, సిమెంట్ ఇటుకలను పెట్టి రైలు పట్టాలు తప్పేలా కుట్రలు చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయని పేర్కొంది. గత ఏడాది జూన్ నుంచి ఇలాంటి ఘటనలు 24 జరిగాయని భారత రైల్వే వెల్లడించింది.


అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌, జార్ఖండ్, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో ఇలాంటి కుట్రపూరిత ప్రయత్నాలను గుర్తించినట్లు రైల్వే శాఖ తెలిపింది. ఇలాంటి ఘటనల కారణంగా ఆగస్ట్‌లో కాన్పూర్‌ సమీపంలో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌లో 20 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ రైలు పట్టాలు తప్పడానికి కారణం పట్టాలపై ఏదో వస్తువు ఉంచినట్లు వెల్లడించింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంపై అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆదివారం మరోసారి కాన్పూర్‌, రాజస్థాన్‌లోని అజ్మీర్‌లోను ఇలాంటి ఘటనలు వెలుగుచూశాయి.


ఇటీవల ప్రయాగ్‌రాజ్ నుంచి భివానీకి వెళ్తున్న కాళింది ఎక్స్‌ప్రెస్‌.. కాన్పూర్ సమీపంలో పట్టాలపై ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ను లోకో పైలట్ గుర్తించి ఎమర్జెన్సీ బ్రేకులు వేశారు. అయితే అప్పటికే రైలు దగ్గరికి రావడంతో సిలిండర్‌ను ఢీకొట్టడంతో అది ఎగిరిపడింది. అయితే ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. లోకో పైలట్, రైల్వే గార్డ్ రైల్వే అధికారులకు సమాచారం అందించగా.. వారు వచ్చి పరిశీలించారు. పట్టాల సమీపంలో ధ్వంసమైన సిలిండర్‌తో పాటు ఒక పెట్రోల్‌ బాటిల్, అగ్గిపెట్టె, 4 గ్రాముల పేలుడు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇలాంటి కుట్రలు ఎంతో కాలం సాగవని ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తీవ్ర హెచ్చరికలు చేశారు. ఇప్పటికే దర్యాప్తు చేసినట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com